Dattatreya Jayanthi : అనంత కరుణా సముద్రుడై భక్తులను సతతమూ రక్షించే సనాతన శాశ్వత ఆనందమే శ్రీదత్తాత్రేయ అవతారం. స్వామి ఇహ, పర ఉభయ ఫలప్రదాత. సనాతన ధర్మంలో అవధూతసంప్రదాయాన్ని ఏర్పరచిన దత్తాత్రేయుడు… శ్రీపాద శ్రీవల్లభుడిగా, నరసింహ సరస్వతిగా పలు అవతారాల్లో భక్తులను నడిపించారు. దత్తాత్రేయుని అవతార విశేషాలను స్మరించుకుందాం.
అత్రి మహాముని సంతానం కోసం ఘోర తపస్సు చేయగా, త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ప్రత్యక్షమవుతారు. ‘మా అంశతో మీకు ముగ్గురు పుత్రులు కలుగుతారు’ అని వరమిస్తారు. ఆ ఫలితంగానే అత్రి, అనసూయ దంపతులకు బ్రహ్మ అంశతో చంద్రుడు, విష్ణు అంశతో దత్తాత్రేయుడు, రుద్రాంశతో దుర్వాసుడు జన్మిస్తారు.
బాల్యం నుంచి దత్తుడు సామాన్యులకు మహిమలను, మునులకు అపూర్వమైన యోగవిద్యను ప్రసాదిస్తూ ఉండేవాడు. తల్లి అనసూయా దేవికి కూడా ఆత్మజ్ఞానాన్ని ప్రబోధించాడు. కపిలుడి అవతారంలో తల్లి దేవహూతికి ఆత్మబోధ చేస్తే, దత్తావతారంలో తల్లి అనసూయకు ఆత్మబోధ చేశాడు. అనంతరం దత్తాత్రేయస్వామి భక్త రక్షణార్థం సహ్యాద్రి గుహల్లో తపస్సు ఆచరించాడు.
ఒకప్పుడు బ్రహ్మ వేదాలను మరచిపోయి దత్తాత్రేయుడిని ఆశ్రయించగా, బ్రహ్మదేవుడికి వేదదానం చేశాడట. మరొకప్పుడు జంభాసురుడనే రాక్షసుడి పీడన నుంచి దేవతలను దత్తాత్రేయుడే రక్షించాడు. కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయుడి కోసం తపస్సు చేసి వెయ్యి చేతులు, నిత్యయౌవనాలను వరంగా పొందాడు. ప్రహ్లాదుడికి అజగరవ్రతధారి మునిరూపంలో సాక్షాత్కరించి ఆత్మజ్ఞానాన్ని బోధించాడు.
తెలుగు రాష్ర్టాలతోపాటు, మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల్లో దత్త సంప్రదాయం విస్తారంగా విరాజిల్లింది. స్వామి తొలి అవతారమైన శ్రీపాదుడు ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురంలో ఆవిర్భవించాడు. మానవులలో పేరుకుపోయిన మనోమాలిన్యాలను, పూర్వపాపాల సంచిత కర్మలను తన స్మరణ మాత్రం చేత తొలగించి, ధన్యతను ప్రసాదించే పుణ్యమూర్తి శ్రీవల్లభుడు. కొన్ని ప్రాంతాల్లో ఈ పౌర్ణమి ‘కోర్ల పూర్ణిమ’గా ప్రసిద్ధి చెందింది.
దత్తాత్రేయుని రెండో అవతారం శ్రీనరసింహ సరస్వతి. అంబ అనే భక్తురాలికి కుమారుడుగా జన్మిస్తానని శ్రీపాదులు చేసిన వాగ్దానాన్ని అనుసరించి ఆవిర్భవించిన అవతారమిది. దత్తాత్రేయుని మూడో అవతారం మాణిక్యప్రభువు. వీరి తల్లిదండ్రులు కల్యాణి నగరంలోని మనోహర నాయకుడు, బయాదేవి దంపతులు. దత్తుని మరో రెండు అవతారాలు అక్కల్కోట మహారాజు, శిరిడీ సాయిబాబా.
దత్తజయంతి రోజున వేకువజామునే లేచి, నదీ స్నానం లేదా ప్రవహించే నీటిలో స్నానం.. అదీ కుదరకపోతే బావి నీరు లేదంటే చన్నీటి స్నానం చేసి, దత్తాత్రేయుడికి షోడశోపచార పూజను చేస్తారు. దత్తాత్రేయుడు జ్ఞాన ప్రదాత కనుక ఈ రోజున ధ్యానం, జపం మొదలైనవి చేస్తారు. నేడు దత్త చరిత్ర పారాయణ, అన్నదానం చేయటం వల్ల విశేష అఖండమైన ఫలితాన్ని పొందవచ్చు.