Coconut Plant Sentiment:స్వయంభువుగా వెలసి వ్యాఘ్రేశ్వరుడిగా దర్శనమిస్తున్న క్షేత్రమే వ్యాఘ్రేశ్వరం. తనకు ముడుపులుగా కొబ్బరి మొక్కను స్వీకరిస్తూ కోరిన కోర్కెలు తీర్చే దేవుడిగా పూజలు అందుకుంటున్న ఈ స్వామి దర్శనం శుభాలను కలిగిస్తుందనేది నమ్మకం. తూర్పుగోదావరి జిల్లా అంబాజిపేట మండలం పుల్లేటికుర్రు పంచాయతీ పరిధిలోని వ్యాఘ్రేశ్వరంలో స్వామి బాలా త్రిపుర సుందరితో వ్యాఘ్రేశ్వరస్వామిగా కొలువై… విశేష పూజల్ని అందుకుంటున్నాడు. ముడుపుగా ఈ ఆలయం సన్నిధానంలో కొబ్బరిమొక్కను నాటి తమ మొక్కును చెల్లించుకుంటారు భక్తులు. అంతేకాదు… మాసశివరాత్రి, ఆరుద్ర నక్షత్రం రోజున, లేదా పౌర్ణమి పర్వదినాలలో లక్షబిల్వార్చన చేయించి తమ భక్తిని చాటుకుంటారు.
స్వామి పులి రూపంలో దర్శనమిచ్చి శివలింగంగా మారడంతోనే ఈ ఆలయంలో శివుడిని వ్యాఘ్రేశ్వరస్వామిగా పిలుస్తున్నారని స్థల పురాణం చెబుతోంది. . పూర్వం ఈ ఊరు పెద్దాపురం సంస్థానంలో ఉండేది. అప్పట్లో ఇది అడవి కావడంతో పులులు ఎక్కువగా తిరిగేవట. ఈ గ్రామానికి సమీపంలో శివభక్తుడైన ఓ బ్రాహ్మణుడు ఉండేవాడట. ఓసారి ఆ భక్తుడు శివరాత్రికి ముందురోజు మారేడు దళాలను సేకరించేందుకు పుల్లేటికుర్రుకు చేరుకున్నాడట. ఆ ఊళ్లోకి అడుగు పెట్టిన కాసేపటికే ఓ పులి అతడిని వెంబడించడంతో ప్రాణభయంతో పరుగుపెట్టి మారేడు చెట్టుపైకి ఎక్కి కూర్చున్నాడట. ఎంతసేపటికీ పులి వెళ్లకపోవడంతో ఆ భక్తుడు చెట్టుపైనే ఉండిపోయాడట.
క్రమంగా శివరాత్రి ఘడియలు సమీపించడంతో ఆ బ్రాహ్మణుడు పరమశివుడిని మనస్సులో తలుచుకుంటూ పులినే శివలింగంగా భావించి దానిపైన ఒక్కో బిల్వదళం వేయడం ప్రారంభించాడట. పూజంతా పూర్తయి… తెల్లారేసరికి మారేడు దళాలన్నీ ఓ గుట్టలా పేరుకున్నాయట. అయితే ఆ గుట్ట అడుగున పులి ఉందని భయపడిన బ్రాహ్మణుడు అటుగా వెళ్తున్న కొందరు రైతుల్ని పిలిచి తన పరిస్థితి వివరించడంతో వాళ్లు గునపంతో దాన్ని చంపేందుకు ప్రయత్నించారట.
ఆ సమయంలో రాయి ఉన్నట్లుగా శబ్దం రావడంతో దళాలను తొలగించిన ఆ రైతులకు అక్కడ శివలింగం కనిపించిందట. బ్రాహ్మణుడు చెట్టుదిగి రైతులతో కలిసి శివలింగాన్ని పూజించి వెళ్లిపోయాడట. ఇది జరిగిన కొన్ని రోజులకు ఆ ప్రాంతాన్ని పాలించే మహారాజుకు స్వామి కలలో కనిపించి తన ఉనికిని తెలియజేసి ఆలయం కట్టించమని చెప్పాడట. దీంతో రాజు ఆలయాన్ని నిర్మించాడనీ.. అప్పటినుంచీ స్వామిని వ్యాఘ్రేశ్వరుడిగా కొలుస్తున్నారనీ… స్వామి శివలింగంగా వెలసిన ప్రాంతాన్నివ్యాఘ్రేశ్వరంగా పిలుస్తున్నారనీ అంటారు.