Chudamani Temple: సాధారణంగా.. భక్తులు గుడికి వెళ్తే కానుకలు సమర్పించి, కోరిన కోర్కెలు నెరవేర్చమని మొక్కుతారు. అలాగే అమ్మవారి ఆలయం అంటే.. భద్రత కట్టుదిట్టంగా ఉంటుంది. ఇక అమ్మవారి కృపకు పాత్రులు కావాలంటే.. ఎన్మో జన్మల పుణ్యం, భక్తి, కరుణ వంటివి ఉండాలంటారు. అప్పుడే అమ్మవారి అనుగ్రహం మనపై ఉంటుందంటారు. కానీ ఓ ఆలయంలో మాత్రం దొంగతనం చేస్తేనే.. అది కూడా పట్టపగలే, అందరూ చూస్తుండగానే దొంగిలించాలట. అప్పుడే అమ్మవారి కృప మనపై ఉంటుందట. ఇంకో వింత ఏంటంటో.. దొంగతనం చేయడానికి అక్కడి పూజారులే సహకరిస్తారట. ఇదేదో వింత ఆచారంలా ఉంది కదూ! రండి ఈ కథేంటో తెలుసుకుందాం.
నగలు, డబ్బు కాదు..
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రూర్కీ జిల్లాలోని చూడియాలాలో ఉందీ ఈ వింత ఆలయం. దాని పేరు ‘చూడా మణి’ ఆలయం. ఇక్కడ దొంగతనం చేయాల్సింది నగలు, డబ్బు, కాదు. అమ్మవారి పాదాల దగ్గర ఉండే చెక్క బొమ్మ. అతి పురాతనమైన ఈ ఆలయాన్ని ఎంతో మంది సందర్శిస్తారు. దీనికి సంతాన ఆలయం అనే పేరు కూడా ఉంది.
అదే ప్రత్యేకత..
పిల్లలు పుట్టాలని ఈ ఆలయానికి వచ్చేవాళ్లు తప్పనిసరిగా దొంగతనం చేయాలి. అది కూడా అందరూ చూస్తుండగా.. పట్టపగలే చేయాలి. ఏడాదిపొడవునా తెరచిఉండే ఈ ఆలయానికి దేశం నలుమూలల నుండీ భక్తులు, ముఖ్యంగా పిల్లలు లేని దంపతులు తరలివస్తారు. అపహరించిన తర్వాత పుట్టిన బిడ్డతో.. మళ్లీ ఆలయానికి వచ్చి ఆ చెక్కబొమ్మతో పాటు మరో చెక్కబొమ్మను జతచేసి తీసుకున్న చోటే పెట్టాలి.
అలా ప్రారంభమైంది..
1805లో ఓ రాజు అడవిలో సంచరిస్తుండగా చూడామణి ఆలయాన్ని చూసి తమకు పిల్లలను ప్రసాదించాలని వేడుకున్నాడు. అప్పుడు అమ్మవారు చెక్క బొమ్మ రూపంలో దర్శనమిచ్చింది. ఎవరికీ తెలియకుండా చెక్క బొమ్మను ఇంటికి తీసుకువెళ్లిన రాజుకు పండంటి బిడ్డ పుట్టాడు. దీంతో రాజు చెక్కబొమ్మతో పాటు మరో చెక్కబొమ్మనూ అమ్మవారికి సమర్పించాడట. అలా గుడిలో బొమ్మని దొంగిలించే ఆచారం ప్రారంభమైందట.