Basara Gnana Saraswathi Temple : జ్ఞానానికి అధిదేవత అయిన సరస్వతీ దేవి కోరి కొలువైన దివ్యక్షేత్రం బాసర. నిర్మల్ జిల్లాలోని గోదావరీ తీరాన ఈ క్షేత్రానికి పురాణ పరంగా ఎంతో ప్రాశస్త్యం ఉంది. ఇక్కడి అమ్మవారి మూర్తిని సాక్షాత్తూ వ్యాసుడు ప్రతిష్ఠించాడని పురాణాలు చెబుతున్నాయి. మనదేశంలో గల రేండే రెండు సరస్వతీ ఆలయాలున్నాయి. ఒకటి కాశ్మీరులో ఉండగా, రెండవది బాసర. నిత్యం వందలాది మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేయించేందుకు ఈ క్షేత్రానికి వస్తుంటారు.
స్థల పురాణ ప్రకారం.. పూర్వం వ్యాస మహర్షి తపస్సు చేసేందుకు అనుకూలమైన ప్రదేశం కోసం అనేక చోట్ల వెతికాడట. ఈ క్రమంలో ఆయన ఎక్కడ తపస్సుకు కూర్చున్నా.. ఆయన మనసు లక్ష్యంపై నిలవలేదట. ఆఖరికి గోదావరీ తీరంలోని నేటి బాసరలో తపస్సుకు కూర్చోగానే ఆయన మనసుకు అనంతమైన సంతోషం కలిగాయి. అక్కడే ఆయన చాలాకాలం తపస్సు చేయగా, అమ్మవారు దర్శనమిచ్చి, ముగ్గురమ్మలకు ఇక్కడ ఆలయం నిర్మించమని ఆదేశించింది.
దీంతో వ్యాస మహాముని గోదావరి నదిలోంచి మూడు గుప్పెళ్ళు ఇసుక తెచ్చి ముగ్గురు దేవతలమూర్తులు ప్రతిష్టించాడట. విగ్రహానికి జీవం పోయడం కోసం తగిన శక్తి కలిగేందుకు సరస్వతీ దేవి వ్యాసునికి జ్ఞాన బీజాన్ని ఉపదేశించింది. బాసరలో జ్ఞాన సరస్వతి అమ్మవారు మహాలక్ష్మి, మహాకాళి సమేతులై కొలువు తీరి ఉంటారు. మహా సరస్వతికి కుడివైపున మహాలక్ష్మి, పై భాగంలో మహాకాళి విగ్రహం ఉన్నది. ఇక్కడి వ్యాస నిర్మితమైన ఇసుక విగ్రహాలకు పసుపు పూసి అలంకరించి పూజలు నిర్వహిస్తారు. ఈ పసుపును ఒక్క రవ్వంత తినినా అత్యంత విజ్ఞానం, జ్ఞానము లభిస్తుందని భక్తుల నమ్మకం.
ఇక్కడ అమ్మవారు కమలంలో ఆశీనురాలై దర్శనమిస్తుంది. కమలం పరిపూర్ణతకు, తత్వ విచారానికీ సంకేతంగా చెబుతారు. ఒకచేత పుస్తకం, మరొకచేత వీణను ధరించిన అమ్మవారు తెల్లని వస్త్రాలతో భక్తులకు దర్శనమిస్తుంది. వ్యాసుడు ప్రతిష్ఠించిన కారణంగానే ఈ క్షేత్రానికి వ్యాసపురి అనేవారనీ, అదే కాలక్రమంలో వ్యాసపుర, వ్యాసర, వాసరగా మారి.. నేడు బాసరగా పిలవబడుతోంది. ఈ ప్రాచీన ఆలయం ముస్లిం ఆక్రమణదారుల చేతిలో ధ్వంసం కావడంతో శృంగేరీ పీఠాధిపతి ఈ ఆలయాన్ని తిరిగి నిర్మించారు. నేడు బాసరలో మనం చూస్తున్న ఆలయం అదే.
బాసర వచ్చే భక్తులు ముందుగా గోదావరిలో స్నానంచేసి ముందుగా పక్కనే ఉండే ప్రాచీన మహేశ్వర ఆలయాన్ని దర్శిస్తారు. అలాగే.. అమ్మవారి దర్శనం తర్వాత అదే ప్రాంగణంలోని దత్త మందిరం, వ్యాసమందిరం, వ్యాసులవారి గుహలను, అదే ప్రాంగణంలోని ఇంద్రేశ్వరం, సూర్యేశ్వరం, వాల్మీకేశ్వరం, తరణేశ్వరం, కుమారేశ్వరం, వ్యాసేశ్వరం తదితర ప్రదేశాలను దర్శించుకుంటారు. ఆలయం సమీపంలోని వేదవతి శిలనూ భక్తులు దర్శిస్తారు. ఈ శిలలో త్రేతాయుగం నాటి సీతాదేవి నగలున్నాయనీ, అందుకే దానిని తడితే.. వేర్వేరు చోట్ల వేర్వేరు శబ్దాలు వస్తాయని చెబుతారు.
బాసర గ్రామం చిన్నదైనా, ఇక్కడి ప్రకృతి భక్తులను ఆనందలోకాలకు తీసుకుపోతుంది. నిజామాబాద్ నుంచి 40 కి.మీ, నిర్మల్కు 35 కి.మీ, హైదరాబాదు నుంచి 205 కి.మీ. దూరంలో ఈ క్షేత్రం ఉంది. దసరా నవరాత్రుల్లో మూలా నక్షత్రం రోజున, గురుపౌర్ణమి, వసంత పంచమి రోజున ఇక్కడ గొప్ప వేడుకలు నిర్వహిస్తారు.