Talambralu : ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన ఈ దేవాలయం భద్రాచలం రాములోరి గుడి.
దేశం నలుమూలల నుండి వేలాది భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది. పవిత్రమైన గోదావరి నది ఈ కొండను చుట్టుకొని దక్షిణ దిశ వైపుగా ప్రవహిస్తూ ప్రకృతి అందాలను ఒలకపోస్తూ ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా భాసిల్లేలా భద్రాచలానికి మరింత ఆకర్షణ తీసుకొచ్చింది.
భద్రాచలంలో జరిగే ఉత్సవాలలో ముఖ్యమైనది శ్రీరామనవమి రోజున జరిగే కళ్యాణం. ఇది దేశ వ్యాప్తంగా అత్యంత ప్రసిద్ది చెందిన ఉత్సవం. ఈ కళ్యాణానికి దేశ నలుమూల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు హాజరవుతుంటారు. పండుగ రోజు భద్రాచలం రామయ్య సన్నిధిలో గడపటాన్ని పూర్వ జన్మ సుకృతంగా భావిస్తుంటారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ముత్యాల తలంబ్రాలు, పట్టు బట్టలు ఈ దేవాలయానికి ప్రతి ఏటా పంపుతోంది. అదే క్రమంలో ఈ సంవత్సరం మార్చి 30వ తేదీనా శ్రీరామనవమి, 31న పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం వేడుకలను ఘనంగా నిర్వహించాలని దేవాదాయ శాఖ నిర్ణయించింది. గతంలో మాదిరిగానే కల్యానోత్సవంలో పరోక్ష పద్ధతిలో భక్తుల గోత్రనామలు పఠించనున్నారు. కల్యానోత్సవం, సామ్రాజ్య పట్టాభిషేకం వేడుకలకు హాజరవలేనివారు ఇప్పటి నుంచే www. bhadrachalamonline.com ద్వారాగానీ, రామాలయ కార్యాలయం ద్వారా పరోక్ష పూజా టికెట్లను పొందవచ్చు.
భద్రుని కోరిక మేరకు భద్రగిరిపై వెలసిన శ్రీరాముడు భద్రాద్రిరాముడయ్యాడు. ఈ భద్రగిరిపై వెలసిన శ్రీరాముని ఆలయమే శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం. ముస్లిం మతంలో పుట్టిన కబీర్ దాస్ కు కూడా ఈ ఆలయంతో దగ్గర సంబంధం ఉంది . కబీర్ దాస్ ఒకసారి ఆలయంలోకి ప్రవేశిస్తున్నపుడు లోపలికి రానివ్వలేదు. ఆ సమయంలో గుడిలోని దివ్య చిత్రాలు మాయమయ్యాయి. ఆయన మళ్లీ గుడిలోకి ప్రవేశించడానికి అనుమతి ఇచ్చిన వెంటనే దివ్య చిత్రాలు పునర్దర్శనం అయ్యాయని చెబుతుంటారు.