Anjaneya : శ్రీరామ నవమికి సిద్ధమవుతోంది ఒంటిమిట్ట కోదండ రామాలయం. కడప జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రంలో విశిష్టమైన హిందూ దేవాలయం ఉంది. ఇక్కడ కోదండ రాముని విగ్రహాన్ని జాంబవంతుడు ప్రతిష్టించాడని చెపుతారు. ఏకశిలలో సీతారామ లక్ష్మణులను మనం ఇక్కడ చూడవచ్చు. ఇది మహర్షులకు తపోధనులకు యజ్ఞ యాగాలకు త్రేతాయుగంలో ప్రసిధ్ది చెందింది. బుషుల తప్పసుకు రాక్షసులు తరచుగా భంగం కలిగించేవారు. శ్రీరాముడు,సీతా,లక్ష్మణ సమేతుడై ఒంటిమిట్టకు వచ్చాడు. కోదండం ధరించి,పిడిబాకుతో రాక్షస సంహారం చేసి బుషుల తపస్సు నిరాటంకంగా సాగేలా చేశాడు అని ఒక కథనం ప్రాచుర్యంలో ఉంది.
ఒంటిమిట్టలో ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ నవమి నుండి బహుళ విదియ దాకా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. చతుర్దశి నాడు కళ్యాణం, పౌర్ణమి నాడు రథోత్సవం ఉంటాయి. నవమి నాడు పోతన జయంతి నిర్వహిస్తారు. ఇక్కడ ఉన్న విగ్రహాలలో హనుమంతుడు ఉండడు. దేశంలో ఆంజనేయ స్వామి లేకుండా రాముల వారి గుడి ఇదొక్కటే. ఈ దేవాలయంలో శ్రీరామ తీర్ధం ఉంది. సీత కోరికపై శ్రీరాముడు రామబాణంతో పాతాళ గంగను పైకి తెచ్చాడని స్థల పురాణంలో ప్రస్తావించింది. గోపుర నిర్మాణం చోళ శిల్ప సాంప్రదాయంలో అత్యద్భుతంగా ఉంటుంది. ఫ్రెంచి యాత్రికుడు టావెర్నియర్ 16వ శాతాబ్దంలో ఈ రామాలయాన్ని దర్శించి భారతదేశంలోని పెద్ద గోపురాలలో ఈ రామాలయ గోపురం ఇదేనని కీర్తించాడు.
రామ లక్ష్మణులు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు, విశ్వామిత్రుడు వారిని తమ యాగరక్షణకు తీసుకున్నాడు. కానీ సీతారామ కల్యాణం జరిగాక కూడా, అలాంటి సందర్భమే ఒకటి ఏర్పడింది. అప్పుడు మృకండు మహర్షి, శృంగి మహర్షి రాముని ప్రార్థించడంతో దుష్టశిక్షణ కోసం, ఆ స్వామి సీతాలక్ష్మణ సమేతుడై అంబుల పొది, పిడిబాకు, కోదండం, పట్టుకుని ఈ ప్రాంతానికి వచ్చి యాగ రక్షణ చేశాడని పురాణం చెబుతుంది. అందుకు ప్రతిగా ఆ మహర్షులు సీతారామ లక్ష్మణుల విగ్రహాలను ఏకశిలగా చెక్కించారనీ, తరువాత జాంబవంతుడు ఈ విగ్రహాలను ప్రాణప్రతిష్ఠ చేశారనీ ఇక్కడ ప్రజల విశ్వాసం.