Amarnath Yatra Temporarily Suspended : అమర్ నాథ్ యాత్రకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. భారీ వర్షాల కారణంగా.. భక్తులకు ఇబ్బందులు కలగకూడదని ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. బల్తాల్, పహల్గాం మార్గాలలో నిన్న రాత్రి నుంచి అడపా దడపా వర్షాలు కురుస్తున్నాయని వెల్లడించారు.
అమర్నాథ్ ఆలయ గుహ, శేషనాగ్ శిఖరం వద్ద ఉష్ణోగ్రతలు పడిపోవచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. సాధారణంగా అక్కడ 15 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత ఉంటే.. నేటి రాత్రికి ఆ ఉష్ణోగ్రత 5 డిగ్రీలకు పడిపోవచ్చని తెలిపింది. రానున్న రోజుల్లో ఉరుములతో కూడిన జల్లులు పడొచ్చని వివరించింది.
ఈ ఏడాది జూన్ 29న అమర్నాథ్ యాత్ర ప్రారంభమవ్వగా.. 3800 మీటర్ల ఎత్తులో ఉన్న అమర్నాథ్ క్షేత్రాన్ని ఇప్పటివరకూ 1.50 లక్షల మందికి పైగా భక్తులు దర్శించుకున్నారు. ఆగస్టు 19న అమర్నాథ్ యాత్ర ముగియనుంది. గతేడాది 4.5 లక్షల మంది యాత్రికులు శివలింగాన్ని దర్శించుకున్నారు. ఈ ఏడాది 52 రోజుల పాటు అమర్నాథ్ యాత్ర కొనసాగనుంది. కాగా.. అమర్నాథ్ యాత్ర ప్రారంభమైన వారంరోజులకే మంచుశివలింగం కరిగిపోతుందన్న వార్తొకటి భక్తులను ఆందోళనకు గురి చేసింది. ఉష్ణోగ్రత పెరగడంతో మంచుశివలింగం కరిగింది.