Tarapith Temple : దేవీ ఆరాధనల్లో సాత్విక ఆరాధనలతో బాటు తాంత్రిక ఆరాధనలూ ఉన్న సంగతి మనకు తెలిసిందే. పశ్చిమ బెంగాల్లోని బీర్భూమ్ జిల్లాలోని తారాపీఠ్ అనే పట్ణణంలోని ఓ ఆలయం ఈ తరహా శక్తి ఆరాధనలకు పేరుగాంచింది. దేశవ్యాప్తంగా పలువురు శక్తి ఆరాధకులు, తాంత్రికులు ఇక్కడ కొలువైన తారాదేవి ఆరాధనకు వస్తుంటారు. ఇక్కడ కొలువైన అమ్మవారు.. ఏది కోరినా ఇస్తుందనే పేరుంది.
పురాణ కథనం ప్రకారం.. క్షీరసాగరాన్ని చిలుకుతున్నప్పుడు ఉద్భవించిన హాలాహలాన్ని పరమేశ్వరుడు స్వీకరించాడు. కానీ దాని ప్రభావం నుండి పరమేశ్వరుణ్ణి తప్పించడానికి ఆ జగన్మాత శ్రీ తారాదేవి రూపంలో ప్రత్యక్షమై ఆయనకు తన చనుబాలనిచ్చి ఆ విష ప్రభావాన్ని తగ్గించినదనీ, ఆ అమ్మవారే నేడు తారాపీఠంలో కొలువైందని చెబుతారు.
స్థలపురాణం ప్రకారం.. పూర్వం వశిష్ట మహర్షి తారా దేవి గురించి తపస్సు చేశాడట. ఎంతకాలం తపస్సు చేసినా.. ఆమె దర్శనం ఇవ్వకపోవటంతో వేదనకు గురికాగా.. ‘ఫలానా’ ప్రదేశంలోని స్మశానంలో అమ్మవారిని ఆరాధిస్తే.. ఫలితం ఉంటుందని అశరీరవాణి ఆయనకు సూచించిందట. ఆ మాట ప్రకారం.. ఆయన నేటి తారాపీఠానికి చేరి తారాదేవిని ఆరాధించగా, ఆమె ప్రత్యక్షమవుతుంది. అప్పడు వశిష్టుడు ‘నాకు శివుడిని చూపించు’ అని కోరగా, అమ్మవారు పరమశివుని దర్శనం ఇప్పించి.. అక్కడే మూర్తిగా నిలిచిపోయిందనీ పురాణగాథ. వశిష్ట మహాముని కోరిక నెరవేరిన ఆ స్థలాన్నే సిద్ధ పీఠం అంటారు.
ఈ గుడిలో రెండు అమ్మవారి విగ్రహాలున్నాయి. ఒకటి.. శివుడికి పాలు ఇస్తున్నట్లు కనిపించే నల్లరాతి విగ్రహం. అమ్మవారి ముఖం తప్ప మిగతా విగ్రహభాగాలన్నీ పూలతో కప్పి ఉంటాయి. ఇక.. రెండవ విగ్రహం.. వేర్వేరు లోహాలతో తయారైనది. 4 చేతులలో ఆయుధాలతో, నెత్తుటి కళ్లతో, నాలుక బయటపెట్టి, చీర, పుర్రెల దండను ధరించి భయంకరంగా కనిపిస్తుంది. ఈ రూపాన్నే తాంత్రికులంతా ఆరాధిస్తారు. ఈ అమ్మవారికి రోజూ జంతుబలులూ జరుగుతుంటాయి. అమావాస్య రోజుల్లో ఈ అమ్మవారి విగ్రహానికి అద్భుత శక్తి ఉంటుందని, ఆ సమయంలో తారాదేవి ఆరాధన చేస్తే.. తీరని కోరికే ఉండదని ప్రతీతి.
తారాదేవిని.. ఉగ్రతారగా, ఏకజట అనికూడా పిలుస్తారు. చూపులకు భయంకరంగా ఉన్నా తన భక్తులకు కల్పవల్లి వంటిది. తరింపజేసే శక్తిగల తల్లి గనుకే ఈమెకు తార అని పేరు. కష్టాలు,బాధలు, అజ్ఞానం, పేదరికం, ఆపదలు, భయాలు, మందబుద్ధి ఉన్నవారు ఈ అమ్మవారిని కొలిస్తే.. గొప్ప మేథస్సు, జ్ఞానం సిద్ధిస్తాయి. ఇక్కడ కొలువైన తారాదేవికి రోజూ శవ భస్మంతో అర్చన జరగుతుంది. అఘోరాలు, తాంత్రికులు, మంత్రగాళ్ళు ఆలయాన్ని ఆనుకుని ఉండే స్మశానంలో రాత్రి వేళల్లో పూజలు చేస్తుంటారు.
తారామతి దేవి శ్మశానంలో సంచరిస్తారనీ, తన పాదాలను ఆశ్రయించిన వారికి లేదనకుండా ఆ తల్లి వరాలిస్తుందని భక్తుల నమ్మకం. ఇక.. సాధారణ భక్తులు కూడా అమ్మవారి దర్శనానికి వస్తుంటారు గానీ.. వారు ఆ పక్కనే ఉన్న స్మశానం వైపు వెళ్లరు. ముఖ్యంగా పెళ్లికాని అమ్మాయిలు.. పొరబాటున అటు కన్నెత్తి కూడా చూడరు. రాంపుర్హాట్ రైల్వే స్టేషన్ నుంచి 9 కి.మీ దూరంలో ఉన్న ఈ పట్టణంలో వసతికి హోటళ్లు కూడ ఉన్నాయి. కలకత్తా ఎయిర్ పోర్టు నుంచి 216 కి.మీ దూరం లో ఈ తారాపీఠ్ ఉంది. అక్కడ నుంచి ప్రేవేటు ట్యాక్సీల ద్వారా ఆలయానికి చేరుకోవచ్చు.