New jersey Temple : అమెరికా న్యూజెర్సీలోని రాబిన్స్విల్లేలో బీఏపీఎస్ స్వామినారాయణ్ అక్షర్ధామ్ ఆలయం లాంఛనంగా ఆరంభమైంది. భారత్ వెలుపల నిర్మించిన అతి పెద్ద హిందూ దేవాలయం ఇదే. మహంత్ స్వామి మహరాజ్ సమక్షంలో భారీ వేడుక నిర్వహించి దీనిని ప్రారంభించారు. ఆయనీ సందర్భంగా ఆలయ ప్రాణప్రతిష్ఠ నిర్వహించారు. ఈ నెల 18 నుంచి భక్తులను దర్శనానికి అనుమతించనున్నారు.
2011లో ఆలయ నిర్మాణం 185 ఎకరాల విస్తీర్ణంలో ఆరంభమైంది. వివిధ దేశాలకు చెందిన 12,500 మంది వాలంటీర్లు దీని నిర్మాణంలో భాగస్వాములయ్యారు. 4.7 మిలియన్ గంటల పాటు వాలంటీర్లు, కళాకారులు శ్రమించి దీనికో అందమైన రూపం తీసుకొచ్చారు. 2 మిలియన్ ఘనపుటడుగుల రాయిని శిల్పులు చెక్కారు.
ఆలయ నిర్మాణం కోసం ఇటలీ నుంచి నాలుగు రకాల చలువరాయి, బల్గేరియా నుంచి లైమ్స్టోన్ను తెప్పించారు. మార్బుల్, లైమ్స్టోన్ తొలుత ఇండియాకు చేర్చి.. అక్కడ నుంచి న్యూజెర్సీకి తరలించారు. దాదాపు 13 వేల కిలోమీటర్ల ప్రయాణించిన అనంతరం ఆ రాళ్లు గమ్యస్థానానికి చేరాయి. అలాగే దేశం నుంచి గ్రానైట్ను, శాండ్స్టోన్ను ఆలయ నిర్మాణానికి పంపారు. ఆలయానికి మయన్మార్ టేకు చెక్కను వినియోగించారు.
ఢిల్లీ, గుజరాత్లలో అక్షరధామ్ల తర్వాత నిర్మితమైన మూడో ఆలయమిది. తొలి అక్షర్ధామ్ ఆలయం గాంధీనగర్లో 1992లో నిర్మించగా.. మలి ఆలయం ఢిల్లీలో 2005లో నిర్మితమైంది. ఆలయంలో మొత్తం 10 వేల విగ్రహాలు, శిల్పాలున్నాయి. ప్రధాన గర్భగుడితో పాటు 12 ఉపాలయాలు, 9 శిఖరాలు, ఓ భారీ గుమ్మటాన్ని అక్షర్ధామ్లో చూడొచ్చు. బ్రహ్మకుండ్ పేరిట ఏర్పాటు చేసిన సంప్రదాయ బావిలో ప్రపంచవ్యాప్తంగా 300 నదుల నుంచి సేకరించిన జలాలను కలిపారు. ఆలయంలో శిల్పకళ భక్తులను కట్టిపడేస్తుంది.