Ahobilam Navanarasimha Temple : శ్రీ మహావిష్ణువు నరసింహుని అవతారంలో కనిపించే 4 దివ్యక్షేత్రాల్లో అహోబిలం ఒకటి. బ్రహ్మాండపురాణంలో, విష్ణుపురాణంలో, భాగవతంలోనూ ఈ క్షేత్రం ప్రస్తావన ఉంది. నల్లమల కొండల్లో అందమైన ప్రకృతి రమణీయత మధ్య కొలువైన ఈ క్షేత్రం ఆళ్లగడ్డ నుండి 25 కి.మీ, నంద్యాల నుండి 65 కి.మీ దూరంలో ఉంది.
రాక్షసరాజైన హిరణ్యకశ్యపుని సంహరించి, తన భక్తుడైన ప్రహ్లాదుని కాపాడుకోవటానికి విష్ణుమూర్తి స్తంభం నుంచి ఆవిర్భవించిన దివ్యమైన క్షేత్రం.. అహోబిలం. భయంకరమైన ఉగ్రరూపంలో వచ్చిన నారసింహుడు.. హిరణ్యకశిపుని గోళ్లతో చీల్చి సంహరించిన సమయంలో మూడు లోకాలు హడలిపోయాయట. అనంతరం స్వామి నేటి ఎగువ అహోబిలంలోని గుహలో స్వయంభువుగా నిలిచిపోయాడట. ఎన్నడూ చూడని ఉగ్రరూపంలో స్వామిని దర్శించిన గరుత్మంతుడు.. స్వామి కొలువైన గుహను చూసి.. ‘అహో.. బిలం’ అన్నాడట. నాటి నుండి ఈ పుణ్యక్షేత్రానికి ఈ పేరు వచ్చిందని పురాణ గాథ.
అయితే.. పసివాడైన ప్రహ్లాదుని కాపాడేందుకు స్వామి మహోగ్ర రూపంలో నల్లమల అడవుల్లో భీకరంగా గర్జిస్తూ సంచరించాడు. ఆ సమయంలో ఆయన మనోస్థితి, హావభావాలకు అనుకూలంగా వేర్వేరు రూపాలను అహోబిలంల సమీపంలోని 9 ప్రాంతాల్లో తిరిగాడు. ఆ ప్రదేశాలే నవ నారసింహ రూపాలుగా పూజించబడుతున్నాయి.
జ్వాలా నరసింహుడు: ఆయనే ఉగ్ర నరసింహ స్వరూపము. మొదటగా వచ్చిన తేజో స్వరూపము. హిరణ్యకశిపుని తన పదునైన గోళ్లతో పొట్ట చీలుస్తున్న స్వరూపములో ఉంటాడు. ఎగువ అహోబిలానికి 4 కి.మీ దూరంలో కనిపించే స్వామి కొలువై ఉంటాడు. ఈ పర్వతాన్ని దర్శన మిస్తాడు. పెళ్లి కానివారు, గ్రహ బాధలున్నవారు ఈ స్వామిని సేవిస్తే.. సమస్యలు తొలగిపోయి కార్యసిద్ధి కలుగుతుంది. మిగిలిన 8 ఆలయాలకూ సులభంగానే చేరుకోవచ్చు గానీ.. ఈ కోవెలకు వెళ్లటం చాలా కష్టంతో కూడుకున్న పని. హిరణ్యకశిపుని సంహరించిన తరువాత నారసింహుడు ఇక్కడే రక్తసిక్తమైన తన చేతులను ఈ పుష్కరిణిలోనే కడుక్కున్నాడట. అందుకే ఇందులోని నీరు ఏడాది పొడవునా ఎర్రగా కనిపిస్తుంది.
అహోబల నరసింహుడు: హిరణ్యకశిపుని సంహరించిన తరవాత కూర్చున్న స్వరూపము. నవ నరసింహులలో ఈయన ప్రధాన దైవం. ఈయననే ఉగ్ర నరసింహ స్వామి అని కూడా అంటారు. ఎగువ అహోబిలంలో చెంచులక్ష్మీ సమేతుడై ఈ స్వామి భక్తులను అనుగ్రహిస్తున్నాడు. శతృభయాలు. గ్రహపీడలు, బుద్ధిమాంద్యం ఉన్నవారు ఈ స్వామిని సేవిస్తే.. ఆయా దోషాలు తొలగిపోతాయి.
మాలోల నరసింహుడు: లక్ష్మీదేవి చెంచులక్ష్మిగా వస్తే ఆమెని స్వీకరించి ఎడమ తొడ మీద కూర్చో పెట్టుకున్న స్వరూపము. ఎగువ అహోబిలానికి 1 కి.మీ దూరంలో ఈ ఆలయం ఉన్న ప్రదేశాన్ని లక్ష్మీపర్వతం అంటారు. మా- అనగా లక్ష్మి. మా – లోలుడు అనగా లక్ష్మీప్రియుడు అని అర్థము .ఆయనే లక్ష్మీ సమేత నరసింహుడు. ఈయనను ఇహ,పర లోకాలలో సిద్ధిని కలిగించే దైవంగా భక్తులు విశ్వసిస్తారు.
కరంజ నరసింహుడు: ఈయన చెట్టుకింద ధ్యాన ముద్రలో ఉంటాడు.
పావన నరసింహుడు: ఈయన దగ్గరకు వెళ్ళి ఒక్కసారి నమస్కారము చేస్తే ఎన్ని పాపాలనైనా తొలగించే దైవం. అందుకే పావన నరసింహుడు అనిపిలుస్తారు. ఈయన ఎగువ అహోబిలానికి 6 కి.మీ. దూరములో దక్షిణ దిశలో కొలువయ్యాడు. అత్యంత ప్రశాంతమైన ఈ ప్రదేశాన్ని క్షేత్రరత్నం అంటారు. ఇక్కడి స్వామిని స్థానికులు పాములేటి నరసింహస్వామి అనీ అంటారు. భక్తులు ఇచ్చిన నివేదనను ఖచ్చితంగా సగం స్వీకరించి మిగతా సగం వారికే ప్రసాదంగా ఇచ్చే దైవంగా ఈయనకు పేరుంది.
యోగ నరసింహుడు: అయ్యప్పస్వామి మాదిరిగా యోగ పట్టము కట్టుకుని యోగముద్రలో కూర్చుంటాడు. ఇప్పటికి అక్కడకి దేవతలు కూడా వచ్చి ధ్యానము చేస్తారు అని చెపుతారు.
చత్రవట నరసింహుడు: ఇక్కడి పెద్ద రావి చెట్టుకింద వీరాసనము వేసుకుని కూర్చుంటాడు. అక్కడకి హూ హ, హా హా అని ఇద్దరు గంధర్వులు శాపవిమోచనము కొరకు నరసింహస్వామి వద్దకి వచ్చి పాటలు పాడి నృత్యము చేసారు. ఆయన తొడమీద చెయ్యి వేసుకుని తాళము వేస్తూ కూర్చున్నారు. కేతు గ్రహ బాధలున్నవారు ఈ స్వామిని సేవిస్తే బాధలు తొలగిపోతాయి. అలాగే.. సంగీతం, సాహిత్యం, నాట్యం, చిత్రలేఖనం వంటి కళలను అభ్యసించేవారు ఈ స్వామిని సేవిస్తే గొప్ప విద్వాంసులుగా రాణింపు పొందుతారు.
భార్గవ నరసింహుడు: పరశురాముడు తపస్సు చేసి నరసింహుని దర్శనం కోరగా ప్రత్యక్షమైన రూపము. ఈ ఆలయం దిగువ అహోబిలానికి 2.5 కి.మీ. దూరంలో ఈశాన్య దిశలో ఉంది. ఇక్కడి అక్షయ తీర్థంలో స్నానం చేస్తే అనంత సంపదలు ప్రాప్తిస్తాయని నమ్మకం. పరశురాముడు తపం ఆచరించింది ఈ తీర్థం ఒడ్డునే గనుక దీనికి భార్గవ తీర్థమనే పేరు కూడా ఉంది.
వరాహ నరసింహుడు: భూమిని తన కోరల మీద ఎత్తిన రూపము.