Srikalahasti:- తిరుమల టూర్ కి వెళ్లిన వాళ్లు చుట్టు పక్కల అన్ని దేవాలయాలను దర్శించుకుంటుంటారు. తిరుపతి సమీపంలోని శ్రీకాళహస్తికి ప్రత్యేకంగా వెళ్తుంటారు. అయితే శ్రీకాళహస్తిని దర్శించుకున్న తరువాత మరే దేవాలయానికి వెళ్లకూడదు.. అలా వెళితే అరిష్టం అనే ఆచారం హిందూ సంప్రదాయంలో కొనసాగుతూ వస్తోంది. శ్రీకాళహస్తి దర్శనం తరువాత మరో గుడికి ఎందుకు వెళ్లకూడదనే దానికి కొన్ని కారణాలు చెబుతున్నారు పెద్దలు. .
గాలి, నింగి, నేల, నీరు, నిప్పు ఇవే పంచభూతాలు. వీటికి ప్రతీకలుగా భూమి మీద పంచభూత లింగాలు వెలిశాయి. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో వెలిసిన వాయులింగం. అయితే ఇక్కడి గాలిని స్పర్శించిన తరువాత ఏ ఇతర దేవాలయాలకు వెళ్లకూడనదే ఆచారం. సర్పదోషం.. రాహుకేతువుల దోషం ఇక్కడికి వచ్చాక పూర్తిగా నయమవుతుంది. శ్రీకాళహస్తిలోని సుబ్రమణ్య స్వామి దర్శనంతో సర్పదోషం తొలగుతుంది. ప్రత్యేక పూజలు చేసుకున్న తరువాత నేరుగా ఇంటికే వెళ్లాలని పూజారులు చెబుతుంటారు.. కారణం దోష నివారణ జరగాలంటే శ్రీకాళహస్తిలో పాపాలను వదిలేసి ఇంటికి వెళ్లడమే.
శ్రీకాళహస్తి తర్వాత తిరిగి ఏ ఇతర దేవాలయాలకు వెళ్లినా దోష నివారణ జరగదట. గ్రహణాలు.. శని బాధలు.. పరమశివుడికి ఉండవని, మిగతా అందరు దేవుళ్లకి శని ప్రభావం.. గ్రహణ ప్రభావం ఉంటాయని చెబుతున్నారు. సూర్య, చంద్రగ్రహణాల సమయాల్లో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుమల సహా అన్ని దేవాలయాలు మూసివేస్తారు. గ్రహణానంతరం సంప్రోక్షణ జరిపి అప్పుడు పూజలు ప్రారంభిస్తారు.
కానీ గ్రహణ సమయంలో శ్రీకాళహస్తి దేవాలయం మాత్రం తెరిచే ఉంటుంది. అంతే కాదు రోజంతా ప్రత్యేక పూజలు జరుగుతూనే ఉంటాయి. అందుకే ఇక్కడ దర్శనం చేసుకున్నాక ఇక ఇతర దైవం దర్శనం అవసరం లేదన్నది పండితుల మాట. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే కుంభమేళా నాలుగు ప్రదేశాలలో శ్రీ కాళహస్తి ఆలయం ఒకటి. కుంభమేళా అనేది హిందూ తీర్థయాత్ర .ఈ సందర్భంగా, లక్షలాది మంది భక్తులు పవిత్ర నదిలో స్నానం చేసి, దేవతల ఆశీర్వాదం కోసం తరలివస్తారు.