Kanyakumari (Triveni Sangam): ఒకే చోట సూర్యోదయం, చంద్రోయం కనిపించే పుణ్యక్షేత్రం.. కన్యాకుమారి. బంగాళాఖాతం, అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రం… ఈ మూడింటిని చూసే అద్భుతమైన ప్రదేశం కన్యాకుమారి. దేశంలోని దక్షిణ భాగంలో చిట్ట చివరి జిల్లా కన్యాకుమారి . తమిళనాడులోని ఈ ప్రాంతం ఆధ్యాత్మికంగాను, పర్యాటకంగాను భక్తుల్ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. సూర్యోదయాన్ని, సూర్యాస్తమయాన్ని ఒకే చోట ఒకేసారి చూడ గలిగే భాగ్యాన్ని కల్పించే ప్రదేశం ఇదొక్కటే. మాములు రోజుల్లో కంటే పౌర్ణమి సమయాల్లో పున్నమి వెలుగు, సూర్య కాంతులు చూడటానికి ఎంతో అద్భుతమైన అనుభూతిని మిగుల్చుతుంది. ఇలాంటి అరుదైన అవకాశం ఇక్కడ మాత్రమే దొరుకుతుంది.
ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఎన్నో దేవాలయాలు కొలువు దీరి ఉన్నాయి. పార్వతీదేవి కన్యగా బాణాసురుడ్ని చంపిన స్థలం కన్యాకుమారిగా పురాణాలు చెబుతున్నాయి. తమిళనాడులోని ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రాల్లో ముఖ్యమైంది కన్యాకుమారి. యాత్రా స్థలంతోపాటు ఆధ్యాత్మిక కేంద్రంగా వందల సంవత్సరాలుగా విరజిల్లుతోంది. కన్యాకుమారిలోని అమ్మన్ ఆలయంలో విగ్రహాన్ని స్వయంగా పరశురాముడే ప్రతిష్టించాడని అంటారు. సముద్ర ఒడ్డునే ఉండే కుమారి అమ్మన్ టెంపుల్ భక్తి, ముక్తితోపాటు ఆనందాన్ని అందిస్తుంది. ఆధ్యాత్మికంగా ఉట్టిపడే అమ్మవారి విగ్రహాన్ని చూడటానికి రెండు కళ్లు సరిపోవు.
గుడి తూర్పు ముఖంగా నిర్మించినప్పటికీ భక్తుల ప్రవేశమార్గం మాత్రం ఉత్తరం వైపున ఉండటం
ఈ ఆలయం ప్రత్యేకత. ఒకప్పుడు తూర్పుద్వారం ద్వారా భక్తుల రాకపోకలు జరిగేవి. అమ్మ వారి విగ్రహానికి అభిముఖంగా బంగాళాఖాతం ఉంటుంది. అమ్మవారి ముక్కు పుడక నుంచి వచ్చే కాంతి సముద్రంలో సంచరించే నౌకలను ఆకట్టుకునేది. దీంతో ఇది సురక్షిత రేవుగా భావించి వచ్చే నావికులు అక్కడ ఉండే నల్లరాతి రాళ్లను ఢీ కొట్టి ప్రమాదానికి గురికావడంతో తూర్పు ద్వారాన్ని మూసి ఉంచడం ప్రారంభించారు. కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రమే ఈ ద్వారాన్ని తెరుస్తారు.
ఈ ఆలయంలో ప్రవేశించడానికి సంప్రదాయ దుస్తుల్ని మాత్రమే వేసుకోవాలి. పంచె కట్టుతోనే లోపలికి అనుమతిస్తారు. షర్ట్, ప్యాంటుతో వెళ్లేందుకు అనుమతించరు. దేశ విదేశాల నుంచి భక్తులు ఈ ప్రాంతాన్ని చూసేందుకు ఏటా భారీ సంఖ్యలో వస్తుంటారు.