Khairatabad Ganesh: అన్ని గణాలకు అధిపతి గణనాథుడు అని అంటారు. ముందుగా ఏ పూజ చేసినా కూడా గణేషుడిని ప్రార్థించిన తర్వాతే ప్రారంభమవుతుంది. గణనాథుని పూజ చేయకుండా ఏ పూజ చేసినా కూడా ఆ పూజ ఫలితం దక్కదని శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే గణేషుడిని ప్రతీ ఏటా గణేష్ చతుర్థి నాడు 10 రోజుల పాటు ఎంతో భక్తి, భ్రద్ధలతో పూజిస్తుంటారు. తిరిగి అనంత చతుర్థి రోజున గణేషుడిని గంగా నదిలో నిమర్జనం చేస్తారు. ఇలా ప్రతీ ఏటా జరిగే గణేషుడి ఉత్సవాలకు ఊరు, వాడ, పట్టణం అంతా సందడిగా మారుతుంది.
దేశ వ్యాప్తంగా గల్లీ గల్లీలో వినాయకుడి విగ్రహాలను ప్రతిష్టించి, మండపాలను అలంకరించి ఎంతో భక్తి, శ్రద్ధలతో పూజిస్తుంటారు. అయితే ఇలా ఎన్ని వినాయకుడి విగ్రహాలు వెలిసినా కూడా కొన్నింటికి మాత్రం ప్రత్యేక ప్రాముఖ్యత, చరిత్ర ఉంటుంది. అందులో హైదరాబాద్ లోని ఖైరతాబాద్ లో వెలిసే గణేషుడికి మాత్రం ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఈ గణనాథుడి దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు బారులు తీరుతుంటారు. వినాయకుడు వెలిసిన మొదటి రోజు నుంచి మొదలుకుని చివరి రోజు వరకు ఏకంగా లక్షల మంది వచ్చి దర్శించుకుంటారు. అయితే ప్రతీ గల్లీలో వినాయకుడి విగ్రహాలు భారీ ఎత్తున వెలిసినా కూడా కేవలం ఖైరతాబాద్ గణేషుడి దర్శనానికి మాత్రం లక్షల మంది రావడం వెనుక ఓ చరిత్ర దాగి ఉందని చాలా మందికి తెలిసి ఉండదు. గత కొన్నేళ్లుగా భారీ ఎత్తున వెలుస్తున్న ఖైరతాబాద్ వినాయకుడి విగ్రహం వెనుక ఏకంగా 70 ఏళ్ల చరిత్ర దాగి ఉంది.
ఆకారం, ఎత్తు, పరిమాణం ఇలా దేనిలో దానికే చాలా స్పెషల్గా ఉండే ఖైరతాబాద్ వినాయకుడి విగ్రహాన్ని ప్రతీ ఏటా విభిన్న రకాలుగా తయారుచేస్తుంటారు. ఈ ఏడాదితో ఖైరతాబాద్ వినాయకుడి విగ్రహం 70 వసంతాలను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఈ ఏడాది 70 అడుగుల ఎత్తుతో తయారు చేసి ప్రతిష్టించారు. 70 ఏళ్ల క్రితం కేవలం ఒక్క అడుగుతో ప్రతిష్టించిన ఈ గణనాథుడిని ప్రతీ ఏటా ఒక్కో అడుగు పెంచుతూ ప్రస్తుతం 70 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా 70 అడుగుల ఎత్తు, భారీ ఆకారంతో తయారుచేశారు. ఈ ఏడాది ఖైరతాబాద్ గణనాథుడు సప్తముఖ గణేషుడిగా భక్తులకు దర్శనమిస్తున్నాడు.
ఈ ఏడాది ప్రతిష్టించిన గణేషుడికి ఇరువైపులా తల్లి పార్వతీ దేవి, తండ్రి శివుడు మరియు శ్రీనివాస కళ్యాణ మండపం కూడా ఉంది. అంతేకాదు ప్రత్యేక ఆకర్షణగా ఈ ఏడాది బాలరాముడి విగ్రహాన్ని కూడా ప్రతిష్టించారు. అయితే ఇందులో ప్రత్యేకత ఏమిటి అంటే. ప్రతీ ఏటా ఈ గణనాథుడిని మట్టితోనే నిర్మిస్తుంటారు.
ఖైరతాబాద్ గణనాథుని విగ్రహం ఎలా మొదలైంది..
1954వ సంవత్సరంలో సింగిరి శంకరయ్య అనే భక్తుడు కేవలం ఒక్క అడుగుతో ఖైరతాబాద్ గణనాథుడి విగ్రహాన్ని తయారుచేశాడు. ఇలా ప్రతీ ఏటా ఒక్కో అడుగు పెంచుతూ రావడంతో 2019వ సంవత్సరంలో ఖైరతాబాద్ గణేషుడి విగ్రహం 61 అడుగులకు చేరుకుంది. ఇలా దేశంలోనే అత్యంత ఎత్తైన విగ్రహంగా రికార్డు సృష్టించింది. ఇలా ప్రతీ ఏటా ఒక్కో అడుగు పెంచగా గతేడాది కంటే 7 అడుగులు ఎక్కువ పెంచుతూ ఈ ఏడాది 70 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 70 అడుగుల ఎత్తుతో గణేషుడి విగ్రహాన్ని నిర్మించారు. ఖైరతాబాద్ గణనాథుడి విగ్రహాన్ని చూసేందుకు భక్తులు బారులు తీరుతున్నారు.