Dasha Mahavidya : పూర్వం దక్షుడు ఒక గొప్ప యజ్ఞాన్ని తలపెట్టాడు. అల్లుడు, కూతురైన పరమేశ్వరుడిని, అమ్మవారిని తప్ప అందరినీ ఆహ్వానించాడు. పుట్టింట జరుగుతున్న యజ్ఞాన్ని చూడాలని అమ్మవారు ఆశపడింది. ఆహ్వానం లేనందున వెళ్లటం మర్యాద కాదన్నాడు శంకరుడు. కానీ.. పుట్టింటి మీద మమకారంతో వెళ్లాల్సిందేనని బయలుదేరింది. దీంతో ఆమెను అడ్డుకునేందుకు పరమేశ్వరుడు సిద్ధపడగా, జగన్మాత ఆగ్రహించి దశ మహావిద్యల రూపాలను ధరించి దశదిశలా( నాలుగు దిక్కులు, నాలుగు మూలలు, ఆకాశం, పాతాళం) వ్యాపించింది. అమ్మవారి ధాటికి అంతటి పరమేశ్వరుడు భయపడి పారిపోబోతాడు శంకరుడు. శివుణ్ని అడ్డుకునేందుకు శివాని దశమహావిద్యా స్వరూపాలతో (పది రూపాలు) అవతరించిందని దేవీ భాగవతంలో కథ. తంత్రసాధనలో ఈ రూపాలను పూజిస్తారు. పులి పిల్లలకు పులి అంటే ఎలా భయం ఉండదో, అలానే సరైన గురువు ఉపదేశంతో, శాస్ర్తానుసారం అనుష్ఠానం చేయగలిగితే ఎంతటి ఉగ్రస్వరూపిణి అయినా అమ్మ తన భక్తులకు ప్రశాంతంగానే దర్శనమిస్తుంది.
కాళి : సమస్త విద్యలకు మూలమైన ఈ తల్లి.. ఏదైనా పని ఆరంభించే ముందు మనిషికి కలిగే భయాలు, అపోహలను దూరంచేసి ధైర్యంగా ముందుకు నడిపిస్తుంది. కాళీ అంటే నలుపు అని అర్థం. ఆమె ఆవాసం శ్మశానం. కాళీ అంటే మరణం, కాలం అని కూడా అర్థం. భయంకరంగా కనిపించినా ఈమె గొప్ప కారుణ్యమూర్తి. శ్రీ రామకృష్ణ పరమహంస వంటి ఎందరో మహా సాధువులు కాళీ మాతను సేవించి మోక్షాన్ని పొందారు. తక్కువ సమయంలోనే అమ్మవారి సాక్షాత్కారం కోరేవారు కాళీ ఆరాధన చేస్తారు.
తార : మోక్షమును ప్రసాదించే రూపమే తారా దేవి. ఈమెను నీలసరస్వతి అనీ అంటారు. భయంకరమైన విపత్తులనుండి భక్తులను కాపాడుతుంది. యోగులు ఈమెను ఉగ్ర తారా రూపంలోనూ ఆరాధిస్తారు. చైత్రశుద్ధ నవమి రాత్రిని తారా రాత్రి అని పిలుస్తారు. బుధ గ్రహ దోషం ఉన్నవారు ఈ అమ్మవారి ని పూజిస్తే మంచి ఫలితం ఉంటుంది. వశిష్ఠ మహర్షి ఈమె భక్తుడే.
ఛిన్నమస్త : అహాన్ని ఖండించి ఆత్మజ్ఞానం ఇచ్చే తల్లి. ఈమె.. తన తెగిన తలను ఎడమ చేతిలో పట్టుకుని కనిపిస్తుంది. తెగిన మొండెం నుంచి 2 రక్తధారలు పక్కనే నిలబడిన ఆమె స్నేహితురాళ్ల నోటిలో పడుతుండగా, తన మొండెం నుంచి పడే ధారను చేతిలోని అమ్మవారి శిరస్సు తాగుతున్నట్లు దర్శనమిస్తుంది. హిరణ్య కశిపుడు, హిరణ్యాక్షుడు వంటివారు ఈ తల్లి భక్తులే.
షోడసి : జ్ఞానం కోరి తనను ఆశ్రయించి వచ్చే వారికి దయతో దానిని అనుగ్రహించే తల్లి. మన విశ్వములోని అన్ని మంత్ర, తంత్రాలూ ఈ అమ్మవారినే ఆరాధిస్తాయి. ఈమె వైభవాన్ని వేదములు కూడా వర్ణించలేకపోయాయి. ఈమె ఉపాసనతో భోగం, మోక్షము సిద్ధిస్తాయి. బుధగ్రహ దోషం ఉన్నవారు ఈ అమ్మవారిని పూజిస్తే మంచి ఫలితం ఉంటుంది.
భువనేశ్వరి : సమస్త లోకాలూ ఆరాధించే దైవం. కోటి మహామంత్రములు ఎల్లపుడు ఈ దేవిని ఆరాధిస్తూ ఉంటాయి. బ్రహ్మాండ రూపాన్ని ధరించ గలిగే శక్తి ఈమె సొంతం. కాలాన్ని శాసించగల శక్తి ఈమె సొంతం. అందుకే యముడికి తల్లి వంటిది. చంద్రగ్రహ దోషం ఉన్నవారు ఈమెను పూజిస్తే మంచి ఫలితం ఉంటుంది.
త్రిపుర భైరవి : చెడుతో పోరాడే శక్తినిచ్చే తల్లి. సృష్టిలో జరిగే మార్పులకు మూలం ఈ తల్లి. ఆకర్షణ, వికర్షణా శక్తులకూ ఈమెయే మూలం. నృసింహ స్వామి అంతటి శక్తిగల తల్లి.
ధూమ్రావతి: విపత్తులు నాశనం చేసి శుభాలను, సంపదలను అనుగ్రహించే తల్లి. ఈమె అనుగ్రహం పొందితే మనిషికి ఆకలి, కోరికలు, కలహాలు, దారిద్ర్యం వంటి సమస్యలు దూరమవుతాయి. రాహుగ్రహ దోషం ఉన్నవారు ఈ అమ్మవారి ని పూజిస్తే మంచి ఫలితం ఉంటుంది.
భగళా ముఖి : శత్రువులను నాశనం చేసే శక్తి. బ్రహ్మదేవుడు, విష్ణువు, పరశురాముడు భగళాముఖీఉపాసకులే. కుజ దోషం ఉన్నవారు ఈ అమ్మవారి పూజ చేయడం మంచిది.
మాతంగి: గృహస్థజీవితాన్ని సుఖవంతంచేసి పురుషార్ధములను సిద్ధింపచేసే శక్తి. మతంగ ముని కుమార్తెగా కూడా పిలుస్తారు.
కమలాలయ : ఈ తల్లి సమృద్ధికి ప్రతీక. భార్గవుల చేత పూజింపబడుట వల్ల భార్గవి అనే పేరూ ఉంది. పద్మావతీ దేవిగానూ పిలుస్తారు. శుక్రగ్రహ దోషం ఉన్నవారు ఈ అమ్మవారి పూజవలన ఫలితాన్ని పొందుతారు.