TDP Worker Murdered in Tammapudi Village : ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ.. అక్కడక్కడా చిన్న చిన్న గొడవలు మినహా ప్రశాంతంగా ముగిసింది. కౌంటింగ్ సమయంలో పెద్దఎత్తున గొడవలు జరుగుతాయని ముందే ఊహించి పటిష్ట బందోబస్త్ ఏర్పాటు చేసింది ఈసీ. కౌంటింగ్ సమయంలో దాడులు దాదాపు జరగలేదు. కానీ.. కౌంటింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత దుగ్గిరాల తమ్మపూడిలో వైసీపీ నేత కమల్ టీడీపీ కార్యకర్తపై దాడి చేశాడు.
టీడీపీ కార్యకర్తపై వైసీపీ నేత కమల్ బ్యాట్ తో దాడిచేసి కొట్టడంతో.. ఖాసీం తీవ్రంగా గాయపడ్డాడు. అక్కడున్నవారు హుటాహుటిన మంగళగిరి ఎన్నారై ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఖాసీం మరణించాడు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ గెలవడంతో విజయోత్సవ సంబరాలకు సిద్ధమవుతున్న ఖాసీంపై కమల్ దాడిచేసినట్లు సమాచారం. గంజాయి మత్తులోనే కమల్ క్రికెట్ బ్యాట్ తో కొట్టాడని ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.