Secundrabad Crime : సికింద్రాబాద్ పరిధిలో ఉన్న బోయిన్పల్లి భవానీనగర్ కాలనీలో విషాద ఘటన జరిగింది. ఇద్దరు కూతుళ్లను చంపి, తండ్రి కూడా ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా తీవ్రకలకలం రేపింది. కుటుంబ కలహాల కారణంగానే ఈ ఘాతుకానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. శ్రీకాంత్ చారి (42) భూదాన్ పోచంపల్లికి చెందిన అక్షయకు 11 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి స్రవంతి (8), శ్రావ్య(7) అనే ఇద్దరు పిల్లలున్నారు. శ్రీకాంత్ ఓ జూవెలరీ షాపులో సిల్వర్ పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
ప్రతిరోజూ లాగానే గురువారం రాత్రి కూడా కుటుంబ సభ్యులంతా కలిసి భోజనం చేసి పడుకున్నారు. ఉదయం అక్షయ లేచి చూసేసరికి పిల్లలు, శ్రీకాంత్ ఉలుకు, పలుకు లేకుండా ఉన్నారు. వెంటనే కింది అంతస్తులో ఉంటున్న అత్త జయమ్మకు విషయం చెప్పగా.. ఆమె వచ్చి ముగ్గురినీ చూసింది. అప్పటికే వారు చనిపోవడంతో.. కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. కాగా.. శ్రీకాంత్ – అక్షయల మధ్య ఎప్పుడూ గొడవలు జరగలేదని స్థానికులు చెబుతున్నారు. స్థానికుల సమాచారం ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించి, మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు.
భర్త, పిల్లలు చనిపోవడంతో.. అక్షయపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ కలహాలు లేదా ఆర్థిక ఇబ్బందుల వల్లే శ్రీకాంత్ పిల్లలను చంపి, తాను ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని భావిస్తున్నారు. రంగంలోకి దిగిన క్లూస్ టీమ్.. శ్రీకాంత్ నిద్రించిన గదిలో ఆధారాలు సేకరించింది. జూవెలరీ షాపులో ఉపయోగించే సైనైడ్ తీసుకుని వీరంతా మరణించినట్లు ప్రాథమికంగా గుర్తించింది. మరోవైపు భర్త, పిల్లలు మరణించడంతో అక్షయ కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. కొడుకు, మనవరాళ్లు ఎలా చనిపోయారో, ఎందుకు చనిపోయారో తనకు తెలియదని శ్రీకాంత్ తల్లి జయమ్మ తెలిపారు.