Road Accident in Rajasthan(Telugu news updates): రాజస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జైత్పూర్ నుంచి హనుమాన్ గఢ్ వెళ్తున్న ఓ కారు గురువారం అర్ధరాత్రి ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం చెందారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించారు. బికనీర్ ప్రాంతానికి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న మహాజన్ పోలీస్ స్టేషన్ పరిధిలో వేగంగా వస్తున్న కారు..వెనుక నుంచి ట్రక్కును ఢీకొట్టినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారని, వీరంతా హర్యానాలోని దబ్వాలీ వాసులుగా గుర్తించారు. ట్రక్కును వేగంగా ఢీకొట్టడంతో.. కారు నుజ్జునుజ్జు అయింది. ఈ కారులో ప్రయాణిస్తున్న వారంతా మృతిచెందారు.
అర్థరాత్రి కావడంతో ముందు వెళ్తున్న ట్రక్కు.. కారు డ్రైవర్ కు సరిగ్గా కనిపించకపోవడంతో ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ ఉన్న స్థానికులు లుంకరన్ సర్ పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించారు. పోలీస్ ఆఫీసర్ నరేంద్ర పునియా తన బృందంతో కలిసి సంఘటనా స్థలంలో పరిశీలించారు. వెంటనే సమీపంలోని టోల్ ప్లాజా అంబులెన్స్ రావడంతో మృతదేహాలను కారులో నుంచి తీసేందుకు ప్రయత్నించారు. కానీ కారులో చిక్కుకోవడంతో వీలుకాలేదు. దీంతో క్రేన్ ను రప్పించారు.
ప్రమాదం చాలా తీవ్రంగా ఉండడంతో అతికష్టం మీద క్రేన్ సహాయంతో అందరినీ బయటకు తీశారు. అందులో ఒక్క బాలిక ప్రాణాలతో ఉండగా..వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే మార్గమధ్యలో మృతతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కారు అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు నిర్ధారించారు.