Punjab man killed by Pakistanis: దుబాయ్ లో దారుణం చోటు చేసుకుంది. భారతీయ యువకుడిని పాకిస్థానీయుల గుంపు అత్యంత కృరంగా దాడి చేసి హత్య చేసింది. యువకుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఉద్యోగం కోసం దుబాయ్ కి వెళ్లిన తమ కొడుకు.. పాకిస్థానీయుల చేతిలో హతమయ్యాడంటూ భోరున విలపిస్తున్నారు.
వివరాల్లోకి వెళితే.. పంజాబ్ రాష్ట్రంలోని లూథియానాకు చెందిన 21 ఏళ్ల యువకుడు మంజోత్ సింగ్ పని నిమిత్తం దుబాయ్ వెళ్లాడు. అతను వెళ్లి ఏడాది అవుతోంది. అయితే, అక్కడ పాకిస్థాన్ కు చెందిన కొంతమందితో కలిసి ఉంటున్నాడు. ఏదో ఒక విషయంలో రూమ్మేట్స్ మధ్య గొడవ కావడంతో పాకిస్థానీయుల గుంపు దాడి చేయడంతో మంజోత్ సింగ్ ప్రాణాలు కోల్పోయాడు. వారి దాడిలో మంజోత్ స్నేహితుడు కూడా గాయపడినట్లు తెలుస్తోంది. ఇది గమనించిన స్థానికులు అతడిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. తన కొడుకుపై కత్తి, ఇతర ఆయుధాలతో దాడి చేసి చంపారంటూ తండ్రి మీడియా ఎదుట కంటతడి పెట్టాడు.
Also Read: భారత్ -రష్యా సంబంధాలపై అమెరికా రియాక్షన్.. ఏమన్నదంటే..?
మంగళవారం కుమారుడి హత్యకు సంబంధించిన వార్త అందిందంటూ తండ్రి దిల్ బాగ్ సింగ్ తెలిపాడు. పాకిస్థాన్ జాతీయులు మంజోత్, అతని స్నేహితుడితో ఏదో ఒక సమస్యపై వాగ్వాదానికి దిగారని, పదునైన ఆయుధాలతో దాడి చేశారని తనకు చెప్పారని దిల్ బాగ్ చెప్పాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు తన కొడుకు విదేశాలకు వెళ్లాడన్నాడు. ఇందుకోసం ఫైనాన్షియర్లు, బంధువుల వద్ద నుంచి అప్పు తీసుకుని మరీ దుబాయ్ కి వెళ్లినట్లు చెప్పాడు. ఇంతలోనే ఇలా జరిగిందంటూ విలపించాడు. కుమారుడి మృతదేహాన్ని ఇంటికి తీసుకువచ్చేందుకు సహాయం చేయాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆయన విజ్ఞప్తి చేశాడు.