Murder in Ranga Reddy: రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఇద్దరు యువకులు హత్యకు గురయ్యారు. ఈ ఘటన కడ్తాల్ మండల కేంద్రంలోని ఫార్చూన్ బటర్ ఫ్లై సిటీ వెంచర్లోని ఓ విల్లాలో జరిగింది. గురువారం విల్లాలో తలుపులు తీసిన వెంచర్ సిబ్బందికి మృతదేహాలు కనిపించడంతో ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ఆ ఇద్దరు యువకులు రక్తపు మడుగులో పడి ఉండడంతో పోలీసులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. గుర్తు తెలియని దుండగులు ఇద్దరు యువకులను విచక్షణారహితంగా చంపినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సంఘటన బుధవారం అర్ధరాత్రి జరిగినట్లు తెలుస్తోంది. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
గోవిందాయిపల్లిలో విషాదఛాయలు..
దారుణ హత్యకు గురైన ఇద్దరు ఒకే గ్రామానికి చెందిన వ్యక్తులుగా పోలీసులు గుర్తించారు. మృతులు కడ్తాల్ మండలంలోని గోవిందాయిపల్లి గ్రామానికి చెందిన గుండెమొని శివ(29), శేషిగిరి(24)గా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో ఆ మృతుల కుటుంబాలు రోదనలు మిన్నంటాయి. ఒకే గ్రామానికి చెందిన యువకులు ఓకేరోజు హత్కకు గురికావడంతో గోవిందాయిపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా, క్లూస్ టీం, డాగ్ స్కాట్ బృందాలు రంగంలోకి దిగాయి. హత్య జరిగిన ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. హత్యకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు. ఎవరు హత్య చేశారా? ఆ ఇద్దరు యువకులు వెంచర్ వద్దకు ఎందుకు వచ్చారనే వివరాలపై ఆరా తీస్తున్నారు. కాల్ డేటా, సీసీ ఫుటేజ్ ఆధారంగా విచారణ చేపట్టారు.