పెళ్లైన కాసేపటికే నవవధుకు హత్యకు గురైంది. ఈ ఘటన కర్ణాటకలోని కేజీఎఫ్ తాలూకా త్యంబరసనహళ్లి గ్రామంలో జరిగింది. లిఖితశ్రీ, నవీన్ లకు ఆగస్టు 7, బుధవారం పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. పెళ్లి జరిగిన అనంతరం పెద్దల ఆశీస్సులు తీసుకుని.. ఇద్దరూ మాట్లాడుకునేందుకు పక్కనే ఉన్న గదిలోకి వెళ్లారు.
కాసేపటికి గదిలో నుంచి అరుపులు వినిపించాయి. మాట్లాడుకోవాలని గదిలోకి వెళ్లిన ఇద్దరూ గొడవపడ్డారు. చేతికి అందిన వస్తువులతో ఒకరినొకరు గాయపరుచుకున్నారు. ఇంతలో గది తలుపులు తెరిచిన పెద్దలు తీవ్రంగా గాయపడిన నవ దంపతుల్ని కేజీఎఫ్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ వధువు లిఖిత మృతి చెందింది.
నవీన్ పరిస్థితి విషమంగా ఉండటంతో.. అతడిని కోలారు ఆస్పత్రికి తరలించారు. అయితే పెళ్లైన గంటకే నవ దంపతులు ఒకరిపై ఒకరు ఎందుకు దాడి చేసుకున్నారు ? వారిద్దరి మధ్య గొడవకు కారణమేంటన్నది తెలియలేదు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.