MAA association takes action against trolloings on lady artists
ఇటీవల కాలంలో చిన్నారులు, ఆడవారిపై ట్రోలింగులు చేసేవారి సంఖ్య పెరిగిపోతోంది. దీనిపై ఇప్పటికే హీరోలు సాయిధరమ్ తేజ్, మంచు మనోజ్ లు ట్విట్టర్ వేదికగా స్పందించారు. వీళ్ల పోస్టులకు ప్రభుత్వం కూడా స్పందించింది. అయినా ఆకతాయిల ట్రోలింగ్స్ ఆగడం లేదు. పైగా సినిమా రంగానికి చెందిన హీరోయిన్లపై ఈ తరహా ట్రోలింగులు ఎక్కువైపోయాయి. హీరోయిన్ల వ్యక్తిగత జీవితంలోకి వెళ్లిపోయి వారి కుటుంబానికి చెందిన వారిని సైతం రోడ్డుకీడుస్తున్నారు దుండగులు. అలాంటి ట్రోలింగులతో సినీ రంగానికి చెందిన తారలు మానసికంగా కుంగిపోతున్నారు.
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అండ
పబ్లిక్ లో మొహం చూపించడానికి సైతం భయపడిపోతున్నారు. ఇకపై ఇలాంటివి సహించేది లేదని..దీనిని సీరియస్ అంశంగా తీసుకుంది మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్. ఆ ప్రక్రియలో భాగంగానే యాంకర్ సుమ భర్త రాజీవ్ కనకాల, నటుడు శివ బాలాజీ, శివకృష్ణ ముగ్గురూ కలిసి శుక్రవారం హైదరాబాద్ డీజీపీని కలిసి లిఖిత పూర్తకంగా ఫిర్యాదు చేశారు.హఠాత్తుగా వీరు పోలీసు మెట్లు ఎక్కేసరికి అక్కడే ఉన్న మీడియా, పబ్లిక్ వీరిని చుట్టుముట్టారు. ఒక్కొక్కరూ ఒక్కో రీతిగా ఆలోచిస్తూ పోలీసుల వద్దకు వీళ్లు ఎందుకు రావలసి వచ్చిందని ఎవరికి తోచింది వాళ్లు మాట్లాడుకోవడం కనిపించింది. మీడియా, పబ్లిక్ ను చూసి ఆగిన ఆ ముగ్గురూ తాము ఎందుకు డీజీపీని కలవాల్సి వచ్చిందో కారణాలు చెప్పుకొచ్చారు.
లిస్ట్ తయారు చేశాం: శివ బాలాజీ, ఆర్టిస్టు
ఈ సందర్భంగా బిగ్ బాస్ ఫేం శివ బాలాజీ మాట్లాడుతూ..సభ్య సమాజంలో ఉంటున్నాం మనం. అనాగరికమైన ట్రోలింగ్స్ పై స్పందించాల్సిన అవసరం ఉంది. అందుకే పనిగట్టుకుని ఇలాంటి ట్రోలింగులు చేసే కొన్ని వార్తా చానళ్లను గుర్తించడం జరిగింది. దాదాపు 200 న్యూస్ ఛానెళ్లను లిస్టును తయారుచేసాం..త్వరలోనే వీరిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ హామీ ఇచ్చారని అన్నారు.
డబ్బు సంపాదించాలనే యావ: శివకృష్ణ, సీనియర్ నటుడు
నటుడు శివకృష్ణ మాట్లాడుతూ కొందరు డబ్బు సంపాదించాలి, ఎక్కువ వ్యూయర్లను ఆకట్టుకోవాలని మహిళా నటీమణులపై వారి గౌరవానికి భంగం కలిగేలా ట్రోలింగులు చేస్తున్నారు. ఇకపై వాటిని ఎంతమాత్రం సహించబోమని..మా అసోసియేషన్ తరపున కంప్లయింట్ ఇవ్వడానికి వచ్చామని అన్నారు.
కుటుంబ సభ్యులను బయటకు లాగుతున్నారు: రాజీవ్ కనకాల, సీనియర్ నటుడు
రాజీవ్ కనకాల మాట్లాడుతూ సోషల్ మీడియాలో ట్రోలింగులు చేసేవారు బరితెగించి మరీ బజారున పడుతున్నారు. ఒకళ్ల కన్నా మరొకరు పోటాపోటీగా ఫలానా హీరోయిన్ వ్యక్తిగత జీవితాలకు వెళ్లి చివరకు వారి కుటుంబ సభ్యులను సైతం బయటకు లాగుతున్నారు. తాను చాలా కాలంగా సినిమా రంగంలో ఉంటున్నానని..ఇలాంటి దారుణమైన ట్రోలింగులు ఎప్పుడూ చూడలేదని..అప్పటి మీడియా కూడా ఎంతో హుందాగా వారిని అగౌరవించేలా రాతలు రాసేవారు కావని..ఇప్పుడు కుప్పలుకుప్పలుగా ఛానల్స్ పుట్టుకొస్తున్నాయని..వీటిని నియంత్రించే వ్యవస్థ లు లేవని ..ఇది చాలా బాధాకరమని అన్నారు. మా అసోసియేషన్ సభ్యులంతా ఒక కుటుంబంలా జీవిస్తున్నామని అన్నారు. ఎవరికి ఆపద వచ్చినా, సమస్యలు ఎదురైనా సమిష్టిగా వాటిని ఎదుర్కొంటామని రాజీవ్ కనకాల స్పష్టం చేశారు.
కాగా వీరిచ్చిన కంప్లెంయింట్ కు స్పందనగా డీజీపీ అటువంటి ట్రోలింగులకు పాల్పడేవారిని కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు.