Kamareddy : నిషేధిత మత్తు పదార్థాలపై ఉక్కుపాదం మోపింది నార్కోటిక్స్ డిపార్ట్మెంట్. ఇటీవల నాగర్కర్నూల్ జిల్లాలో భారీగా ఆల్ఫ్రాజోలం దొరకడంతో ఈ కేసును సీరియస్గా తీసుకున్న నార్కోటిక్ బ్యూరో దీనిపై కూపీ లాగుతున్నారు. దర్యాప్తులో భాగంగా ఆల్ఫ్రాజోలం ఎక్కడెక్కకడకు సరఫరా అవుతుంది.. ఈ అక్రమ దందా వెనుక ఉన్నదెవరన్నదానిపై ఆరా తీస్తున్నారు. తీగ లాగితే డొంక కామారెడ్డిలో కదిలింది.
కామారెడ్డి జిల్లాలో కల్తీ కల్లు దందా కలకలం రేపుతోంది. నిషేధిత ఆల్ఫ్రాజోలం దందాను హైదరాబాద్ కు చెందిన నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ అధికారులు భగ్నం చేశారు. రెండు రోజుల క్రితం కామారెడ్డి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ కు చెందిన ఒక కానిస్టేబుల్ ను, ఇద్దరు కల్తీకల్లు తయారీదారులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 3 కోట్ల రూపాయల విలువ గల నిషేధిత 30 కిలోల ఆల్ఫాజోలంను స్వాధీనం చేసుకున్నారు. ఆల్ఫ్రాజోలంను కల్తీకల్లు తయారీలో వినియోగిస్తారు. అయితే.. కామారెడ్డి జిల్లాలో కొందరు సిండికేట్గా ఏర్పడి మత్తు పదార్థాలను కలిపి కల్తీకల్లు విక్రయిస్తున్న విషయం ఇటీవల వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలోని కామారెడ్డి ఎక్సైజ్ ఎస్హెచ్ఓ కార్యాలయంలో కానిస్టేబుల్గా విధులు నిర్వహించే వ్యక్తితో పాటు మరో ఇద్దరిని హైదరాబాద్కు చెందిన నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ వారు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి మూడు కోట్ల విలువైన నిషేధిత ఆల్ఫాజోలం స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మరి కొంతమంది ఎక్సైజ్ సిబ్బంది ప్రమేయం ఉన్నట్టు అనుమానిస్తున్నారు.
ఈ విషయంపై కామారెడ్డి ఎక్సైజ్ సూపరింటెండెంట్ రవీందర్ రాజు, కామారెడ్డి ఎక్సైజ్ ఎస్హెచ్ఓ విక్రమ్లను వివరణ అడుగగా తమకు ఆదివారం సాయంత్రమే విషయం తెలిసిందని లిఖితపూర్వకంగా ఎలాంటి ఆదేశాలు రాలేదని తెలిపారు. ఎక్సైజ్ అధికారులుగా కొందరు సిబ్బంది ఆల్ఫాజోలం దందా చేస్తున్నట్టు సమాచారం. తమ ఉద్యోగాన్ని ఆసరాగా చేసుకొని హైదరాబాద్, మహారాష్ట్ర నుంచి నిషేధిత మత్తు పదార్థాలను తీసుకువచ్చి కల్తీకల్లు తయారు చేసే వ్యక్తులకు ఇస్తున్నట్టు తెలిసింది. ఈ కేసులో మరి కొంతమంది సిబ్బంది ప్రమేయం ఉండడంతో కామారెడ్డి జిల్లా అధికారి శాఖలో ఈ వ్యవహారం కలకలం రేపింది. ఎక్కడ తమ పేర్లు బయటకు వస్తాయోనని వారు భయపడిపోతున్నారు.
మరోవైపు డ్రగ్స్ మాఫియా ముఠాలో చేరి కోట్లు గడించాడు గచ్చిబౌలికి చెందిన నరసింహాగౌడ్. ఆల్ప్రా జోలం సరఫరాపై కూపీ లాగుతున్న నార్కోటిక్ టీం నరసింహతోపాటు అతడి కొడుకు రాజశేఖర్ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే వీరి విచారణలో గత 25 ఏళ్లుగా డ్రగ్స్ ట్రాన్స్పోర్ట్లో నరసింహ గౌడ్ యాక్టీవ్గా ఉన్నట్టు ఒప్పుకున్నాడు. ప్రతి నెల హైదరాబాద్లో నలభై కేజీల వరకూ ఆల్ప్రా జోలం డ్రగ్ను విక్రయిస్తున్నట్లు విచారణలో అంగీకరించినట్టు సమాచారం. ఢిల్లీ నుంచి మెట్రో కొరియర్ సర్వీస్లో మత్తు పదార్థాలు తరలించినట్లు గుర్తించారు పోలీసులు. వీటి కోసం నరసింహా హవాలా మార్గాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. డ్రగ్స్ దంగా ద్వారా నరసింహ గౌడ్ భారీగానే ఆస్తులు కూడబెట్టాడని.. ఇప్పటికే అతడిపై పలు కేసులు ఉన్నాయంటున్నారు నార్కోటిక్ బ్యూరో అధికారులు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా పెద్దఎత్తున మత్తు పదార్థాలను విక్రయించేందుకు వీటిని ఢిల్లీ నుంచి తెలంగాణకు తీసుకు వచ్చినట్లు తెలిపారు. మొత్తం 34 కేజీల ఆల్ఫ్రా జోలంను నర్సింహ సిటీకి తీసుకువచ్చినట్లు పోలీసులు గుర్తించారు.