Kadapa Crime: ఇంటర్ విద్యార్థినిపై పెట్రోల్ పోసి వైఎస్సార్ హత్య చేసేందుకు యత్నించాడు ఓ ఘనుడు. నమ్మకంగా రమ్మన్నాడు.. ఆ తర్వాత పెట్రోల్ పోసి, ఒక్కసారిగా అగ్గి రాజేశాడు. ఇంకేముంది నమ్మి వెళ్లిన ఆ బాలిక ఇప్పుడు మృత్యువుతో పోరాటం చేస్తోంది. ఈ ఘటన జరిగింది వైఎస్సార్ కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలోని గోపవరం మండలంలో..
విద్యార్థినిపై పెట్రోల్ పోసి నిప్పంటించడంతో స్థానికులు, వెంటనే కడప రిమ్స్ వైద్యశాలకు తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకొని, వివరాలు ఆరా తీశారు. అలాగే ఘటనకు గల కారణాలను పోలీసులు దర్యాప్తులో భాగంగా తెలుసుకుంటున్నారు. ఈ ఘటన జరిగినట్లు సమాచారం అందుకున్న కడప ఎస్పీ హర్షవర్ధన్, స్థానిక పోలీసుల ద్వారా అన్ని వివరాలు తెలుసుకొని, వెంటనే కారకులను గుర్తించాలని ఆదేశించారు.
పోలీసుల వివరాల మేరకు.. బద్వేలు రామాంజనేయనగర్ కు చెందిన విఘ్నేశ్, ఇంటర్ చదువుతున్న మైనర్ బాలికకు బాల్యం నుండి పరిచయం ఉంది. అయితే ఏమైందో ఏమో కానీ పీపీకుంట చెక్పోస్ట్ సమీపంలోని చెట్ల వద్ద ఇద్దరు కలుసుకున్నారు. అక్కడ విఘ్నేశ్ పెట్రోల్ బాటిల్ రెడీగా ఉంచుకొని, సదరు విద్యార్థినిపై పోసి నిప్పంటించాడు. దీనితో సదరు విద్యార్థిని గట్టిగా కేకలు వేయగా.. స్థానికులు అక్కడికి చేరుకున్నారు. అయితే తనను కలవకపోతే చనిపోతానని, విద్యార్థినిని విఘ్నేశ్ బెదిరించినట్లు, మంచిగా పిలిపించుకొని ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు భావిస్తున్నారు.
కాగా అసలు ఎందుకు వీరిద్దరు కలిశారు.. అసలు విభేధాలు ఎలా వచ్చాయి.. అసలేం జరిగిందనేది పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది. కాగా పోలీసులు ఈ కేసులో పురోగతి సాధించినట్లు సమాచారం. ఇప్పటికే నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఘటన జరిగినట్లు సమాచారం అందుకున్న సీఎం చంద్రబాబు సైతం స్పందించారు. వెంటనే ఈ ఘటనకు కారకులైన వారిని చట్టరీత్యా శిక్షించాలని, అలాగే విద్యార్థినికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులను సీఎం ఆదేశించారు. సీఎం ఆదేశాలతో ఎస్పీ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని, వివరాలు తెలుసుకోవడంతో పాటు స్థానికులను విచారించారు.
కాగా.. ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీసులు ముమ్మర గస్తీ, విద్యార్థులలో చైతన్యం కలిగిస్తున్నా ఇటువంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని టీడీపీ నేతలు అంటున్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు గట్టి చర్యలు తీసుకోవాలని, నిందితులకు చట్టరీత్యా శిక్షించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.