Jadcherla RTC Bus Accident: తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మహబూబ్ నగర్ జిల్లాలోని జడ్చర్ల మండలం బురెడ్డిపల్లి సమీపంలో ఆర్టీసీ బస్సు, డీసీఎం వ్యాన్ ఢీకొన్నాయి. అర్ధరాత్రి 1.45 గంటల సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో 8 మంది ప్రయాణికులకు గాయలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన మహబూబ్ నగర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ప్రయాణికులకు చికిత్స అందిస్తున్నారు.
జాతీయ రహదారి 44పై రోడ్డు ప్రమాదం జరగడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఏపీకి చెందిన ఈ ఆర్టీసీ బస్సు రాత్రి 12గంటలకు హైదరాబాద్లోని ఎంజీబీఎస్ నుంచి శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరానికి బయలుదేరింది. జడ్చర్ల సమీపంలో మలుపు వద్ద ఓ డీసీఎం యూటర్న్ తీసుకునేందుకు ఒక్కసారిగా మలుపు తిరిగింది. ఈ క్రమంలోనే డీసీఎంను బస్సు ఢీకొట్టింది. దీంతో బస్సు అదుపు తప్పి రోడ్డు కిందికి దూసుకెళ్లింది.
ఈ ఘటనలో డ్రైవర్తోపాటు పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సమయంలో ప్రయాణికులంతా నిద్రలో ఉన్నారు. ఒక్కసారిగా భయాందోళనకు గురైన ప్రయాణికులు అద్దాలు పగలగొట్టుకొని బస్సు నుంచి బయటపడ్డారు. ఇందులో తీవ్రంగా గాయపడిన వారిని ప్రయాణికులే బయటకు తీసుకొచ్చారు.
వెంటనే ప్రయాణికులు పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో మంటలు అంటుకున్నాయి. అగ్రిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేలోగా బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఒకవేళ ప్రయాణికులు అప్రమత్తమై గాయపడిన వారిని బయటకు తీసి ఉండకపోతే చాలా ఘోర ప్రాణ నష్టం జరిగి ఉండేదని అక్కడివారు తెలిపారు.
గాయపడిన వారిలో అనంతపురం జిల్లాకు చెందిన లక్ష్మీదేవి సంజీవ. కూకట్ పల్లి మోహన్, మైథిలి, కార్తీక్, దస్తగిరి, హీరాలీల్, అర్చన, సునీల్, గాయత్రితో మరికొంతమంది ఆస్పతిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం అందరి పరిస్థితి నిలకడగానే ఉందని, ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు.