Hyderabad Real Estate Scam: హైదరాబాద్లో మరో రియల్ ఎస్టేట్ సంస్థ బిచాణా ఎత్తేసింది. కస్టమర్లను నిండి ముంచేసి కోట్ల రూపాయలు వసూలు చేసింది. బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో అసలు గుట్టు బయటపడింది.
– హైదరాబాద్లో ఇంకో రియల్ ఎస్టేట్ స్కామ్
– విల్లాల పేరుతో దోచేసిన స్క్వేర్ అండ్ యార్డ్స్ ఇన్ఫ్రా
– 120 మంది నుంచి రూ.24 కోట్ల దాకా వసూలు
– నగర శివారులో ఫాంహౌస్ విల్లాలు అంటూ మోసం
– ముందు పెట్టుబడి పెట్టాలని డబ్బులు తీసుకున్న సంస్థ
– పోలీసులను ఆశ్రయించిన బాధితులు
– నలుగురు కంపెనీ డైరెక్టర్ల అరెస్ట్
హైదరాబాద్, స్వేచ్ఛ: హైదరాబాద్లో మరో రియల్ ఎస్టేట్ సంస్థ బిచాణా ఎత్తేసింది. కస్టమర్లను నిండి ముంచేసి కోట్ల రూపాయలు వసూలు చేసింది. చివరకు బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో గుట్టంతా బయటకు వచ్చింది. ఆంధ్రప్రదేశ్కు చెందిన నలుగురు కలిసి స్క్వేర్ అండ్ యార్డ్స్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో కంపెనీని స్థాపించారు.
హైదరాబాద్ శివారులో ఫాంహౌస్ విల్లాల పేరుతో జనాన్ని నమ్మించారు. ఫాంహౌస్ విల్లాల కోసం పెట్టుబడి పెడితే రెట్టింపు డబ్బులు ఇస్తామని చెప్పారు. వీరి మాటలు నమ్మి, మొత్తం 120 మంది దాకా పెట్టుబడి పెట్టారు. దాదాపు రూ. 24 కోట్ల దాకా వసూలు చేసిన కంపెనీ, తర్వాత బోర్డు తిప్పేసింది.
స్థలాలు లేకపోయినా ఉన్నట్టు చూపి డబ్బులు వసూలు చేయడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. కంపెనీ యజమాని బైరా చంద్రశేఖర్తో పాటు డైరెక్టర్లు వేములపల్లి జాన్వీ, గరిమెళ్ల వెంకట అఖిల్, రెడ్డిపల్లి కృష్ణ చైతన్యపై సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
చంద్రశేఖర్ మూసాపేటలో ఉంటుండగా, ఇతని స్వస్థలం ఆంధ్రప్రదేశ్లోని చిలకలూరిపేట. నిందితులపై సీఆర్ నెంబర్ 75/2024 యూ/ఎస్ 316(2), 318(4), 61(2) బీఎన్ఎస్, సెక్షన్ 5 కింద కేసులు నమోదు చేశారు. దీనికి సంబంధించిన వివరాలను పోలీసులు మీడియాకు వివరించారు.
నెలవారీ రాబడుల పేరుతో పెట్టుబడులు పెట్టించి 120 మందిని మోసం చేశారని తెలిపారు. కూకట్పల్లిలోని మంజీర ట్రినిటీ కార్పొరేట్ బ్లాక్ 810లోని 8వ అంతస్తులో మొదట ఆఫీస్ నడిపారని, తర్వాత జూబ్లీహిల్స్, కావూరి హిల్స్కు కార్యాలయాన్ని మార్చారని వివరించారు.
స్క్వేర్ అండ్ యార్డ్స్, యాడ్ అవెన్యూస్ సంస్థలు కలిసి ఈ మోసానికి పాల్పడ్డాయి. ముందు రూ.17 లక్షలు డిపాజిట్ చేస్తే, 100 నెలలపాటు రూ.30వేల రూపాయల చొప్పున అందిస్తామని కస్టమర్లను ఆకర్షించారు నిందితులు.
తమ భూముల్లో గంధపు చెట్లు నాటుతామని చెప్పి, అవి పెరిగాక అదనపు లాభాలు సంపాదించవచ్చని జనాన్ని బుట్టలో వేసుకున్నారు. బధితులకు కొన్ని నెలలు సక్రమంగా డబ్బులు ఇచ్చి తర్వాత ముఖం చాటేసినట్టు పోలీసులు వివరించారు.