Hyderabad Police planning Deportation implement on Drugs dealers passports
ఎన్ని చట్టాలు చేసినా..ఎంత నిఘా పెట్టినా హైదరాబాద్ పరిధిలో డ్రగ్స్ కేసులు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. ఇక డ్రగ్స్ కేసులో ఎవరైనా సెలెబ్రిటీ దొరికితే పోలీసులు చేసే హడావిడి అంతా ఇంతా కాదు. ఓ వారం పాటు హడావిడి చేస్తారు తర్వాత వదిలేస్తారు. అప్పటిదాకా ఎంతో హడావిడి చేసి కోర్టులు, బెయిల్, శిక్ష అంటూ తిప్పి..తీరా పీక్ మూమెంట్ లో క్లీన్ చిట్ ఇచ్చేస్తున్నారు పోలీసులు. ఇక డ్రగ్స్ అమ్మకం దారులపైనా సాదాసీదా కేసులే నమోదు చేస్తున్నారు పోలీసులు. కొందరు వారిచ్చే మామూళ్లకు అలవాటుపడి వదిలేస్తున్నారు. డ్రగ్స్ ప్రోత్సహిస్తున్న వ్యాపారులపై కఠిన శిక్షలు అమలు చేయడం లేదు. ఒక వేళ వాళ్లు అరెస్టయినా మళ్లీ బెయిల్ మీద బయటకు వచ్చేస్తున్నారు. ఎందుకంటే వీళ్లను పెంచి పోషించేది రాజకీయ, సినిమా సెలబ్రిటీలే. వీరి అండతో యథేచ్ఛగా అమ్మకాలు సాగిస్తున్నారు డ్రగ్స్ విక్రయదారులు.
నైజీరియా నుంచే ఎక్కువగా
డ్రగ్స్ ముఠా ఎక్కుడగా నైజీరియా నుంచే వస్తున్నారు. అయితే నార్కొటిక్స్ అధికారులు ఇకపై మద్యం విక్రేతలపై నిఘా పెంచనున్నారు. విదేశాలనుంచి పెద్ద ఎత్తున డ్రగ్స్ తో వచ్చి యథేచ్ఛగా అమ్మకాలు సాగిస్తున్న ముఠాలపై హైదరాబాద్ పోలీసులు , నార్కొటిక్ అధికారులు కఠినంగా వ్యవహరించాలని భావిస్తున్నారు. ఎయిర్ పోర్టులలోనే నిఘా వ్యవస్థను విస్తృత స్థాయిలో పెంచుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో మత్తు మందు విక్రయాలపై కఠిన వైఖరి అవలంభిస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్ డ్రగ్స్ రహిత సిటీగా హైదరాబాద్ ను డెవలప్ చేయాలని అనుకుంటోంది. ఇప్పుడు డ్రగ్స్ విక్రేతలపై సరికొత్త పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. ఎయిర్ పోర్టు పరిధిలోనే విక్రేతలను అడ్డుకుని వారిపై డిపోర్టేషన్ ప్రయోగించాలని అనుకుంటున్నారు.
డిపోర్టేషన్ అంటే..
డిపోర్టేషన్ అంటే వారి దేశాలకే తిరిగి వారిని పంపించేయడం. భారత్ లో వారి వీసా చెల్లుబాటు కాకుండా చూడటం. వారిని వారి దేశంలోనే శిక్షించేలా అక్కడి ప్రభుత్వానికి వారిని అప్పగించడం వంటి చర్యలతో చాలా మటుకు డ్రగ్స్ సరఫరా తగ్గించేయొచ్చని అధికారులు భావిస్తున్నారు. హెరాయిన్, కొకైన్ డ్రగ్స్ లోనే ఖరీదైనవిగా చెబుతుంటారు. అయితే డ్రగ్స్ కు అలవాటు పడిన వారు ఎంత ఖరీదైనా సరే చెల్లించి వీటిని విదేశస్తులనుంచి కొనుగోలు చేస్తున్నారు. చాలా మంది విదేశీయులు తమ వీసా గడువు ముగిసినా విదేశాలకు తిరిగి వెళ్లకుండా తప్పించుకుని తిరుగుతున్నారు. ఎక్కుడగా డ్రగ్స్ వినియోగించే గోవా, బెంగళూరు ప్రాంతాలనుంచి వీరి స్థావరాలు ఏర్పాటు చేసుకుని డ్రగ్స్ ను హైదరాబాద్ కు సరఫరా చేస్తున్నారని సమాచారం. కొన్ని సంవత్సరాలుగా డ్రగ్స్, మత్తు మందుల సరఫరాతోనే వీళ్లు తమ జీవనాలు సాగిస్తున్నారు.
బలమైన సాక్ష్యాలు లేక..
వీరిని అరెస్టు చేసినా బెయిల్ మీద బయటకు వచ్చేస్తున్నారు. తిరిగి డ్రగ్స్ ను అమ్ముస్తున్నారు. శిక్షలంటే వీరికి భయం లేదు. పట్టుబడిన వీరిపై బలమైన సాక్ష్యాలు పోలీసులు చూపించలేకపోతున్నారు. దీనితో వీరికి బెయిల్ చాలా ఈజీగా దొరుకుతోంది. తగిన ఆధారాలతో వీళ్లను జైలులో ఉంచినా లాభం లేకుండా పోతోంది. పైగా వీళ్లలో ఏ కోశానా మార్పు రావడం లేదు. అందుకే వీళ్లకు డిపోర్టేషన్ అమలు చేసి వాళ్ల దేశాలకే పంపించే ఏర్పాట్లు చేయగలిగితే చాలా వరకూ డ్రగ్స్ సరఫరాను నియంత్రించవచ్చని భావిస్తున్నారు.