Mayor Vijayalakshmi case: చట్టం ముందు ఎవరైనా ఒక్కటే. దానికి ఏ ఒక్కరూ అతీతులు కాదు. అనే విషయాన్ని హైదరాబాద్ పోలీసులు నిరూపించారు. రూల్స్ ఉల్లంఘించిన కారణంగా హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మిపై పోలీసులు కేసు నమోదు చేయడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఇదెక్కడి చట్టమంటూ కొందరు నేతలు ప్రశ్నిస్తున్నారు. అసలేం జరిగింది?
బతుకమ్మ పండుగ సందర్భంగా ఈనెల 10న హైదరాబాద్లో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. పొల్యూషన్ రూల్స్ ప్రకారం.. సమయం దాటిన తర్వాత డీజే సౌండ్స్ పెట్టుకుని డ్యాన్సులు చేయడంపై పోలీసులు కన్నెర్ర చేశారు. దీనిని సుమోటాగా తీసుకున్న హైదరాబాద్ పోలీసులు.. మేయర్ విజయలక్ష్మి, ఆర్గనైజర్, డీజే సౌండ్ నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.
రీసెంట్గా హైదరాబాద్ సిటీ పరిధిలో మతపరమైన కార్యక్రమాలకు డీజేలను వాడకంపై పోలీసులు నిషేధం విధించారు. ఈ తరహా కార్యక్రమాలకు పోలీసులు అనుమతి ఇచ్చినప్పటికీ డీజే సౌండ్ను పరిమితంలో మాత్రమే వినియోగించాలి. వాటిని అతిక్రమిస్తే కేసులు తప్పవని ఇదివరకు పోలీసులు వార్నింగ్ ఇచ్చిన విషయం తెల్సిందే.
ఇంకా లోతుల్లోకి వెళ్తే.. బతుకమ్మ వేడుకల్లో మేయర్ విజయలక్ష్మి తల్వార్ పట్టుకుని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినట్టు వార్తలు వస్తున్నాయి. స్టేజ్పై మాట్లాడుతూ పోలీసులు వచ్చినా ఏమీ పర్వాలేదని, తాను తల్వార్ పట్టుకున్నానని, అవసరమొస్తే రేపు మీరు పట్టుకోవాలంటూ వ్యాఖ్యలు చేసినట్టు జోరుగా ప్రచారం సాగుతోంది.
ALSO READ: డీజే సౌండ్ పెరిగిందో.. బ్యాండ్ బాజానే.. పోలీసులు తాజా హెచ్చరికలు
ఈ విషయంలో మేయర్ కు ఒక రూలా.. సామాన్యుడికి మరో రూలా అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు రేగాయి. ఈ వ్యవహారంపై పోలీసులు రియాక్ట్ కావడం, కేసు నమోదు చేయడం చకచకా జరిగిపోయింది.
ఈనెల ఒకటిన సిటీలో సౌండ్ పొల్యూషన్పై కొత్త రూల్స్ వచ్చాయి. కొత్త రూల్స్ ప్రకారం రెండు కేటగిరిలుగా విభజించారు. ఉదయం ఆరు నుంచి రాత్రి 10 వరకు, రాత్రి 10 నుంచి ఉదయం ఆరు వరకు డీజే సౌండ్ను పరిమితంగా మాత్రమే ఉపయోగించాలి. కానీ, నిర్వాహకులు దాన్ని ఉల్లంఘించడంపై కేసు రిజిస్టర్ అయ్యింది.
నార్మల్గా అధికారంలో ఉన్నవారిపై కేసు నమోదు చేయడం చాలా తక్కువ. అందులోనూ హైదరాబాద్ మేయర్పై కేసు నమోదుపై ఒకటి రెండు సార్లు ఆలోచించారు పోలీసులు. కాకపోతే ప్రజల నుంచి విమర్శలు తీవ్రం కావడంతో తప్పలేదని అంటున్నారు. ఇది ఒకరకంగా విపక్షాలకు వార్నింగ్ లాంటిదని అంటున్నారు కొందరు రాజకీయ నేతలు.