Doctor Suicide| ఎవరికైనా ఆరోగ్య సమస్య వస్తే డాక్టర్ వద్దకు వెళతారు. కానీ అలాంటి డాక్టర్ తనకు సమస్య వస్తే.. పరిష్కారం కోసం చూడకుండా ఆత్మహత్య చేసుకుంది. వివాహం అయిన రెండేళ్లకే భర్త, అత్తమామలు పెట్టే మానసిక వేధింపులు భరించలేక ఒక మహిళా డాక్టర్ ప్రాణాలు వదిలింది. ఈ ఘటన మహారాష్ట్ర లో పరభణి జిల్లాలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్ర పరభణి జిల్లాకు చెందిన డాక్టర్ ప్రియాంక బూమ్రే అనే 28 ఏళ్ల యువతికి బీడ్ నగరానికి చెందిన డాక్టర్ నీలేశ్ తో 2022 సంవత్సరంలో వివాహం జరిగింది. అయితే వివాహం జరిగిన రెండు నెలల తరువాత నుంచే డాక్టర్ ప్రియాంకకు వేధింపులు మొదలయ్యాయి. ఆమె భర్తకు సొంతంగా ఆస్పత్రి నిర్మించుకోవాలనే కోరిక ఉండేది. దీంతో డాక్టర్ నీలేశ్ తన భార్య, అత్తమామల నుంచి కోటి రూపాయలు కావాలని అడిగాడు. కానీ ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో డాక్టర్ అయిన ప్రియాంక వద్ద కోటి రూపాయలు తన భర్తకు ఇవ్వడం చాలా కష్టంగా మారింది. దీంతో ఆమె తాను అంత డబ్బు ఇవ్వలేనని చెప్పింది.
Also Read: 56 ఏళ్ల రాజుకు 16వ భార్యగా 21ఏళ్ల సుందరి.. ‘రాజకీయం కాదు ప్రేమే కారణం’!
అయితే డాక్టర్ నీలేశ్, అతని తల్లిదండ్రులు, సోదరుడు, సోదరి అందరూ కలిసి కొత్త పెళ్లికూతురు అయిన డాక్టర్ ప్రియాంకపై తరుచూ కోటి రూపాయలు ఎలాగైనా ఏర్పాటు చేయాల్సిందేనని అడిగేవారు. ప్రియాంక వారెంత చెప్పినా వినకపోయేసరికి ఒకసారి డాక్టర్ నీలేశ్ ఆమెను కొట్టాడు. దీంతో డాక్టర్ ప్రియాంక తన అత్తమామలు, భర్త, అతని తోబుట్టువులపై గృహహింస కేసు నమోదు చేసింది. ఈ కేసు కోర్టులో విచారణ జరుగుతోంది. ఆ తరువాత నుంచి డాక్టర్ ప్రియాంక తన భర్త ఇంటిని వదిలి పుట్టింటికి వచ్చేసింది.
అయినా ప్రియాంకకు ఆమె భర్త, అత్తమామలు ఫోన్ చేసి చిత్రహింసలు పెట్టేవారు. దీంతో కొన్ని రోజుల క్రితం డాక్టర్ ప్రియాంక తన పుట్టింట్లో ఉరి వేసుకుంది. కానీ కాసేపు తరువాత ఆమె తల్లి గదిలోకి వచ్చి చూడగా.. డాక్టర్ ప్రియాంక నేలపై అపస్మారక స్థితిలో పడి ఉంది. పైన ఫ్యాన్ కు చీర వేలాడుతోంది. అంటే డాక్టర్ ప్రియాంక ఉరి వేసుకున్న తరువాత ఆమె బరువుకి కింద పడిపోయింది. డాక్టర్ ప్రియాంకను ఆమె కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ వైద్యులు ఆమె అప్పటికే చనిపోయిందని చెప్పారు.
Also Read: పండుగ రోజు విషాదం.. ఇడ్లీ తిని వ్యక్తి మృతి.. అత్యాశకు పోయి ఎన్ని తిన్నాడంటే?..
ప్రియాంక మరణానికి ఆమె భర్త, అత్తమామలు పెట్టిన వేధింపులే కారణమని ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చనిపోయే రోజు మధ్యాహ్నం ప్రియాంకకు ఆమె భర్త ఫోన్ చేసి గొడవ చేశాడని.. ఆ తరువాతనే ప్రియాంక ఆత్మహత్య చేసుకుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు భారతీయ న్యాయ సంహితలోని సంబంధిత చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
డాక్టర్ ప్రియాంక లాంటిదే మరో మహిళా డాక్టర్ కూడా ఇటీవలే ఆత్మహత్య చేసుకుంది. మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ కు చెందిన డాక్టర్ ప్రతీక్ష (26) 5 నెలల క్రితం వివాహం జరిగింది. ఆమె భర్త ఆమె శీలాన్ని శంకించేవాడు. నిత్యం ఆమె ఫోన్ లో ఎవరితో మాట్లాడుతోంది, ఎవరికి మెసేజ్ లు, వాట్సాప్ చాటింగ్ చేస్తోందని చెక్ చేసేవాడు. ఆమె ఫోన్ కాల్స్ ని రికార్డ్ చేసి వినేవాడు. రష్యాలో ఎంబిబిఎస్ చదువుకున్న డాక్టర్ ప్రతీక్ష ఇటీవలే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
Also Read: అత్తకు రోజూ అల్లుడు మెసేజ్లు.. అరెస్ట్ చేసిన పోలీసులు, పాపం ఆమె గుండె పగిలింది