Fake Doctor: ఏ సమస్య వచ్చినా ఇంటర్నెట్ పై ఆధారపడటం పెరిగిపోతున్నది. వస్తువులు కొనుగోలు చేయడం దగ్గరి నుంచి.. తినే ఆహారం కోసం, తిరగడానికి టూరిస్ట్ స్పాట్ కోసం, ఆరోగ్య సమస్య వచ్చినా ఏమిటో కనుక్కోవడానికి వెంటనే మొబైల్ ఫోన్లో ఇంటర్నెట్ ఓపెన్ చేసి సెర్చ్ చేస్తున్నారు. కొందరైతే మరీ దారుణంగా మందులను కూడా ఇంటర్నెట్లో వెతికేస్తున్నారు. బిహార్లోని ఓ ఫేక్ డాక్టర్ ఏకంగా సర్జరీ ఎలా చేయాలా? అని యూట్యూబ్ వీడియోలో చూసి పేషెంట్ పై ప్రయోగం చేశాడు.
బిహార్లోని సరన్ జిల్లాలో మధౌరాకు చెందిన అజిత్ కుమార్ పూరి డాక్టర్గా చెలామణి అవుతున్నాడు. పెయిన్ కిల్లర్లు, ప్యారాసిటమల్స్, ఇతర కొన్ని ట్యాబ్లెట్లను ప్రధానంగా ఉపయోగించుకుని పేషెంట్లకు చికిత్స అందిస్తున్నాడు. స్థానికంగా అతను నిజంగానే వైద్యుడనే నమ్మకం ఏర్పడింది.
మధౌరాలో 15 ఏళ్ల బాలుడు తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడ్డాడు. వాంతులు కూడా చేసుకున్నాడు. తట్టుకోలేని కడుపు నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆ బాలుడిని ‘డాక్టర్’ అజిత్ కుమార్ పూరి దగ్గరికి శుక్రవారం రాత్రి తీసుకువచ్చారు. ఆ బాలుడిని పరీక్షించి.. కనీసం కుటుంబ సభ్యులకు తెలియజకుండానే డైరెక్ట్గా ఆపరేషన్ చేయడం ప్రారంభించాడు. పిత్తాశయం నుంచి రాయిని తొలగించడానికి ఆపరేషన్ చేయడం మొదలు పెట్టాడు.
ఆపరేషన్ మొదలు పెట్టిన కుటుంబ సభ్యులకు తెలిసింది. వారు బయటి నుంచి బాలుడి పరిస్థితిని పరిశీలించారు. ఆ వైద్యుడు తన ఫోన్లో యూట్యూబ్ వీడియో ఓపెన్ చేసి చూస్తూ.. అందులో చేసినట్టుగా బాలుడిపై ఆపరేషన్ ప్రయోగం చేశాడు. కానీ, ఆ బాలుడి పరిస్థితి విషమించసాగింది. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. ఆ వైద్యుడిపై ఆగ్రహించారు. దీంతో వైద్యుడు అజిత్ కుమార్ పూరి రివర్స్ అయ్యాడు. ‘ఇక్కడ డాక్టర్ను నేనా? మీరా? ఏం జరుగుతున్నదో మీకు తెలుసా? నాకు తెలుసా?’ అని బుకాయించాడు.
Also Read: Mathu Vadalara 2 Trailer: మత్తు వదిలించిన ట్రైలర్.. మామూలుగా లేదు భయ్యా
మళ్లీ ఆపరేషన్ చేయడానికి ఉపక్రమించాడు. కానీ, బాలుడి పరిస్థితి విషమించింది. దీంతో వెంటనే ఆ బాలుడిని అలాగే పాట్నాలోని హాస్పిటల్కు తరలించే ప్రయత్నం చేశాడు. కానీ, హాస్పిటల్ రాకముందే దారి మధ్యలోనే బాలుడు మరణించాడు. ఇది గమనించిన అజిత్ కుమార్ పూరి అక్కడి నుంచి పరారయ్యాడు.
దీంతో బాలుడి కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. వైద్యుడిపై ఆగ్రహంతో ఊగిపోయారు. కానీ, వైద్యుడు పరారు కావడంతో వారు పోలీసు స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. అజిత్ కుమార్ పూరి నిర్లక్ష్యం, మాల్ ప్రాక్టీస్పై ఆరోపణలు చేశారు. అజిత్ కుమార్ పూరికి వైద్యుడి అర్హతలు లేవని, అనుభవమూ లేదని పేర్కొన్నారు. ఆయన చర్యల వల్లే టీనేజీ బాలుడు మరణించాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు ఆ ఫేక్ డాక్టర్, ఆయన క్లినిక్ స్టాఫ్ పై కేసు నమోదు చేశారు. తనిఖీలు చేస్తున్నారు. పరారీలో ఉన్న అజిత్ కుమార్ పూరి కోసం గాలింపులు చేస్తున్నారు. బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపించారు.