Engineering Student Suicide Due to Loan App Harassment in AP: ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు తాళలేక ఓ ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. నదిలో విద్యార్థి మృతదేహం లభ్యం కావడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మీడియాలో వస్తున్న వార్తా కథనాల ప్రకారం.. ఏపీలోని విజయవాడకు చెందిన వంశీ అనే విద్యార్థి ఇంజినీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్నాడు.
అయితే.. అతను ఇంట్లోవాళ్లకు తెలియకుండా లోన్ యాప్ లో రూ.10 వేల రుణం తీసుకున్నాడు. ఆ లోన్ యాప్ నిర్వాహకులు రూ. లక్ష వరకు డబ్బులు చెల్లించాలంటూ అతడిని వేధించారని, దీంతో అతను ఆ విషయాన్ని ఇంట్లోవాళ్లకు చెప్పకుండా భయపడి ఈ నెల 25న ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత తాను చనిపోతున్నానని కుటుంబ సభ్యులకు మెసేజ్ పెట్టాడు. ఆ మెసేజ్ చూసి ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు అతనికి ఫోన్ చేయగా స్విచ్ఛాప్ వచ్చింది.
Also Read: మాజీ మంత్రి, విజయ డెయిరీ డైరెక్టర్ యెర్నేని సీతాదేవి కన్నుమూత
వంశీ కుటుంబ సభ్యులు రెండు రోజులుగా అతని ఆచూకీ కోసం గాలించారు. ఈ క్రమంలో గుంటూరు జిల్లా తాడేపల్లిలోని కృష్ణా నది వద్ద అతడి మొబైల్ ఫోన్, చెప్పులు, బైక్ కనిపించాయి. అనుమానంతో నదిలో గాలింపు చేపట్టగా అతడి మృతదేహం లభ్యమైంది. తండ్రి ఫిర్యాదు మేరకు తాడేపల్లి పోలీసులు మృతదేహాన్ని బయటకు తీశారని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.