Dead Body In Car(Hyderabad news today): మారుతి కారులో ఓ వ్యక్తి మృతదేహం లభ్యం కావడం స్థానికంగా కలకలం సృష్టిస్తోంది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలోని మణికొండలో వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లాలోని మణికొండలో ఓ మారుతి కారులో మృతదేహం ఉండడం స్థానికులు గమణించారు. మృతదేహాన్ని చూసిన స్థానికులు భయాందోళనకు గురైన వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న నార్సింగి పోలీసులు హుటాహుటీన ఘటనాస్థలానికి చేరుకున్నారు.
అనంతరం పోలీసులు కారులో డ్రైవర్ వెనక సీట్లో మృతదేహం ఉన్నట్లు గుర్తించారు. మృతదేహాన్ని పరిశీలించి విచారణ జరపగా.. ఆ మృతదేహం మణికొండకు చెందిన ఆటోడ్రైవర్ రమేశ్దిగా గుర్తించారు. ఇక మృతుడి వివరాల గురించి ఆరాతీసిన పోలీసులు ఈ నెల 4న రమేష్ తన స్నేహితులతో కలిసి యాదగిరిగుట్టకు వెళ్లినట్లు తెలిసింది. అయితే రమేష్ మృతి పైన పోలీసులకు పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఈ నేపథ్యంలో పోలీసుల రమేష్ మృతిని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. ఈ క్రమంలో ఎదైన గొడవ జరగడంతో రమేష్ హత్యకు గురైయ్యాడా? లేక అనారోగ్యం కారణంగా మరణించాడా? లేక ఆత్మహత్యకు పాల్పడ్డాడా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేప్పట్టారు.
మృతదేహాన్ని శవపరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కారు నెంబర్, అలానే సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు ఈ కేసు చేధించడానికి ప్రయత్నిస్తున్నారు. రమేష్ మృతి గురించి తెలుసుకున్న అతని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.