Hanmakonda Crime : హన్మకొండ జిల్లాలో దారుణం జరిగింది. సర్వీస్ రివాల్వర్తో సొంత అత్తను కాల్చి చంపాడు. గోదావరి ఖని పీఎస్ లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న ప్రసాద్..ఈ దారుణానికి ఒడిగట్టాడు. గుండ్ల సింగారంలోని ఇంద్రా కాలనీలో ఈ దారుణం జరిగింది. ఆర్థిక లావాదేవీలు, కుటుంబ కలహాలతోనే కానిస్టేబుల్ ప్రసాద్ కోటపల్లి అత్తపై కాల్పులు జరిపినట్లు స్థానికులు పోలీసులకు తెలిపారు. ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు రక్తపు మడుగులో పడి ఉన్న మృతురాలు కమలమ్మను పోస్టుమార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎంకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని.. ఘటనా ప్రాంతంలో క్లూస్ ను సేకరిస్తున్నారు. నిందితుడు కాల్పులు జరిపిన రివాల్వర్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న కానిస్టేబుల్ ప్రసాద్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం మంచినీరు తెమ్మని అత్తను అడిగిన ప్రసాద్.. ఆమె లోపలికి వెళ్తుండగా కాల్పులు జరపడంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. అత్తను రూ.4 లక్షలు ఇవ్వమని అడుగగా.. ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. ప్రసాద్ ఇప్పటికే చేసిన అప్పులకు కమలమ్మనే ప్రతి నెలా వడ్డీ కడుతుందని, అయినా అతని ధనదాహం తీరలేదని బంధువులు వాపోయారు. ఈ ఘటనతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. కమలమ్మ మృతితో బంధువుల రోదనలు మిన్నంటాయి.