Bride on Sale Elopes| కొత్తగా పెళ్లి అయిన తరువాత కుటుంబాల్లో చాలా మార్పులు జరుగుతుంటాయి. ఇంటికి వచ్చిన కొత్త కోడలికి బాధ్యతలు అప్పగిస్తారు. మన సమాజంలో వివాహం తరువాత మహిళలు ఇంటిపనితో పాటు అత్తమామలు, భర్త గురించి కేర్ తీసుకుంటూ ఉంటారు. అయితే అలా అత్తగారింటికి వెళ్లిన కొత్తలో ఓ యువతి ఎవరూ ఊహించని పనిచేసింది. ఆ పెళ్లి కూతురు చేసిన వంట తిన్న తరువాత ఆ కుటుంబ సభ్యులంతా పోలీసుల వద్దకు వెళ్లాల్సి వచ్చింది. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్ రాష్ట్రాంలోని బూందీ జిల్లాలో దబ్లానా గ్రామానికి చెందిన దుర్గా శంకర్ అనే 24 ఏళ్ల యువకుడికి లీలావతి(19) అనే యువతితో ఇటీవలే వివాహం జరిగింది. అయితే లీలావతి ఇంటికి వచ్చనప్పటి నుంచి వారితో సఖ్యంగా ఉండడంలేదు. తనకు అక్కడ ఉండడం ఇష్టం లేదని చెప్పేది. పుట్టింటికి తిరిగి వెళ్లి పోదామనుకున్నా ఆమె తల్లిదండ్రులు అందుకు అనుమతించడం లేదు.
ఇక చేసేది లేక లీలావతి అత్తారింట్లోనే ఉండాల్సి వచ్చింది. అయితే అక్కడ అత్తగారు ఆమెకు ఇంటి పని బాధ్యతలు అప్పగించారు. అందులో భాగంగానే ఆమె ఇంట్లో అందరికోసం వంట చేయాల్సి వచ్చింది. ఇంటి పని చేయాలంటే ఇష్టం లేని లీలావతి.. గత వారం అందరి కోసం వంట చేసింది. ఇంట్లో ఆమె భర్త, అత్తమామలు భోజనం చేశాక పడుకున్నారు. కానీ మరుసటి నిద్ర లేవలేక పోయారు. వారికి తలంతా భారంగా ఉంది. అతికష్టం మీద నిద్రలేచాక చూస్తే.. ఇంట్లో లీలావతి కనిపించడం లేదు. ఆమె కోసం ఇల్లంతా వెతికారు.
Also Read: భర్త కావలెను.. రూ.30 లక్షల ప్యాకేజీ, 3 BHK ఇల్లూ ఉండాలట, రెండో పెళ్లి కోసం యాడ్ ఇచ్చిన మహిళ
లీలావతి భర్త దుర్గా శంకర్ ఇంటి బయట, పరిసరాల్లో అంతా వెతికినా ఆమె కనిపించలేదు. పైగా ఇంట్లో తన బైక్ కూడా కనిపించడం లేదు. ఇంట్లో కొన్ని నగలు, డబ్బు కూడా లేదు. దీంతో సాయంత్రం వరకు చూసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ముందుగా లీలావతి తల్లిదండ్రలు లేదా బంధువుల ఇంటికి ఫోన్ చేయాలని సూచించారు. కానీ ఎక్కడా ఆమె జాడ తెలియలేదు. లీలావతి తల్లిదండ్రులు మధ్యప్రదేశ్ కు చెందిన వారు. అక్కడికి కూడా లీలావతి లేదనే తెలిసింది.
రెండు రోజుల తరువాత పోలీసులు దుర్గా శంకర్ ఇంటి నుంచి రైల్వే స్టేషన్, బస్టాండ్ వెళ్లే మార్గాల్లోని సిసిటీవి కెమెరాలను పరిశీలించారు. సిసిటీవి వీడియోల్లో లీలావతి బైక్ పై వెళుతున్నట్లు కనిపించింది. దీంతో పోలీసులు విచారణ చేయగా.. అసలు విషయం బయటపడింది. దుర్గాశంకర్ కు ‘నాథ్ప్రథా’ సంప్రదాయం ప్రకారం వివాహం జరిగిందని తెలిసింది.
Also Read: ఫారిన్లో ఉద్యోగం చేస్తున్న యువకుడు.. పెళ్లికి ముందు యువతిని ఎలా మోసం చేశాడంటే..
నాథ్ప్రథా అంటే పెళ్లికూతురిని వరుడి కుటుంబం వారు కొనుగోలు చేసుకుంటారు. అందుకోసం యువతి తల్లిదండ్రులతో స్టాంప్ పేపర్ పై అగ్రీమెంట్ చేసుకుంటారు. అలా దుర్గాశంకర్ కూడా మధ్యప్రదేశ్ కు చెందిన లీలావతిని కొనుగోలు చేసి పెళ్లి చేసుకున్నాడు. ఇలాంటి సంప్రదాయం చట్ట వ్యతిరేకమైనా.. పోలీసులకు ఎవరూ ఫిర్యాదులు చేయకపోవడంతో ఇంకా ఈ కుసంస్కృతి మనుగడలో ఉంది. ముఖ్యంగా గుజరాత్, బీహార్, రాజస్థాన్, హర్యాణా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం లీలావతి కోసం పోలీసులు గాలిస్తున్నారు.