Bareilly Serial Killer| ఒక వ్యక్తి తన జీవితంలో అనుభవించన మానసిక చిత్రహింస వల్ల కృూరమృగంగా మారాడు. 14 నెలల వ్యవధిలో ఏకంగా 9 మహిళలను ఒకే విధంగా హత్యచేశాడు. అతను ఇల్లు వదిలి ఊరికి దూరంగా పాడుబడిన బంగళాల్లో, అడవుల్లో నివసించేవాడు. అతను చివరిసారిగా హత్య చేసిన మహిళతో కలిసి మాట్లాడడం చూసిన ఓ వ్యక్తి.. కిల్లర్ రూపురేఖల గురించి పోలీసులకు చెప్పాడు. అంతే పోలీసులు అతను చెప్పిన పోలీకలతో స్కెచ్ గీయించి ఊళ్లో అందరికీ పంచిపెట్టారు. ఆ తరువాత 48 గంటల్లో కిల్లర్ ను గుర్తించి పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల ఆధీనంలో ఉన్న ఆ సైకో.. తానే హత్యలు చేశానని అంగీకరించాడు. ఎందుకు చేశాడో? ఎలా చేశాడో? కూడా వివరించాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని బరేలి నగరంలో జరిగింది.
పోలీసుల కథనం ప్రకారం.. 38 ఏళ్ల కుల్దీప్ ఒక మానసిక రోగి. బాల్యంలో అతను అనుభవించిన చిత్రహింసల కారణంగా అలా హంతకుడిగా.. పిచ్చివాడిగా మారిపోయాడు. కుల్దీప్ చిన్నప్పుడు అతని తల్లి జీవించి ఉండగానే అతని తండ్రి బాబూరామ్ మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. ఇంట్లో అతనికి ఇద్దరు చెల్లెళ్లు కూడా ఉన్నారు. అయితే కుల్దీప్ తండ్రి బాబూరామ్ తన రెండో భార్య మాటలు విని కుల్దీప్ తల్లిని కొట్టేవాడు. అడ్డుచెప్పిన కుల్దీప్, అతని చెల్లెళ్లను కూడా చితకబాదేవాడు. ఒక రోజు కుల్దీప్ సవతి తల్లి అతడిని కొట్టే సమయంలో అడ్డుపడిందని అతని చెల్లిని కూడా గట్టి కొట్టడంతో ఆ పాప చనిపోయింది. దీంతో ఇంట్లో కుల్దీప్ తల్లి, సవతి తల్లికి గొడవజరగింది. బాబూరామ్ మాత్రం తన రెండో భార్యనే సమర్థించాడు. దీంతో కుల్దీప్ తల్లి, అతని చెల్లిని తీసుకొని కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంది.
Also Read: ‘రైల్వే ఉద్యోగం కావాలా? రూ.20 లక్షలు ఖర్చు అవుతుంది!’.. యువతిని మోసం చేసిన ‘అమిత్ షా సెక్రటరీ’
ఇదంతా కళ్లారా చూసిన కుల్దీప్ మతిస్థిమితం కోల్పోయాడు. ఇంట్లో అతని సవతి తల్లి .. చిత్రహింసలు పెడుతూ ఉండేది. అలా పెద్ద వాడైన కుల్దీప్ కు 2014లో వివాహం జరిగింది. కుల్దీప్ భార్య కూడా ఒక సంవత్సరంలోనే అతడిని వదిలేసి వెళ్లిపోయింది. అప్పటి నుంచి కుల్దీప్ పూర్తిగా పిచ్చివాడైపోయాడు. మహిళలంటే అతనికి ద్వేషం. ఇంట్లో తన సవతి తల్లిని కొట్టి వెళ్లిపోయాడు.
ఊరి చివర పాడుబడిన ఇళ్లలో, పొలాల వద్ద తిరిగేవాడు. మాదకద్రవ్యాలకు అలవాటు పడ్డాడు. ఒకరోజు ఊరి చివర తన సవతి తల్లి లాగా 50 ఏళ్ల వయసు గల మహిళ ఒంటరిగా వెళ్లడం చూసి.. ఆమెను పొలాల్లో బలవంతంగా ఈడ్చు కెళ్లాడు. అక్కడ ఆమెపై అత్యాచారం చేసి ఆమె చీరతో గొంతుకు ఉరివేసి చంపాడు. ఆ రోజు కుల్దీప్ కు మానసికంగా ఏదో తెలియని సంతోషం కలిగింది. ఇక అప్పటి నుంచి ఎప్పుడూ ఒక 45-50 ఏళ్ల వయసు గల మహిళను చూసినా ఆమెపై అలాగే అత్యాచారం చేసి.. హత్య చేసేవాడు. హత్య చేసిన తరువాత ఆ చనిపోయిన మహిళ.. గుర్తుకగా ఆమెకు సంబంధించిన లిప్ స్టిక్ లేదా హ్యాండ్ బ్యాగ్, లాంటి వస్తువుని తీసుకునేవాడు.
అయితే ఇటీవల ఒక మహిళ హత్య కేసులో.. హత్య చేసిన విధానం ఇంతకు ముందు జరిగిన హత్యలలాగానే అనిపించడంతో పోలీసులు విచారణ తీవ్రం చేశారు. ఒక వ్యక్తి కుల్దీప్ ని చూశాననడంతో.. పోలీసులు కుల్దీప్ పోలికలతో స్కెచ్ వేయించారు. ఆ స్కెచ్ చూసి ఊరి వారు.. ఇలాంటి ఒక వ్యక్తి ఊరి చివరన ఉన్నాడని చెప్పాడు. దీంతో పోలీసులు వెంటనే వెళ్లి కుల్దీప్ ని అదుపులో తీసుకున్నారు. కుల్దీప్ తన నేరాలను అంగీకరించడంతో.. పోలీసులు అతనిపై హత్య కేసులు నమోదు చేశారు.
Also Read: వెబ్ సిరీస్ చూసి బాలుడి మర్డర్.. ప్రేమ కోసం హంతకురాలిగా మారిన ఎంబిబియస్ విద్యార్థిని