21 Killed as Bus Rolls down in Gorge: జమ్మూకాశ్మీర్ లో తీవ్ర విషాదం నెలకొన్నది. బస్సు లోయలో పడి 21 మంది వరకు మృతిచెందినట్లు తెలుస్తోంది. అదేవిధంగా ఈ ప్రమాదంలో 50 మందికి పైగా గాయాలైనట్లు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. జమ్మూకాశ్మీర్ లో అఖ్నూర్ వద్ద యాత్రికులను తీసుకువెళ్తున్న బస్సు అదుపు తప్పి 150 అడుగుల లోతున్న లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 21 మంది వరకు మృతిచెందినట్లు సమాచారం. 50 మందికి తీవ్ర గాయాలయ్యాయని తెలుస్తోంది. విషయం తెలుసుకున్న స్థానికులు, పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బస్సు శిథిలాల కింద ఇరుక్కున్నవారిని బయటకు తీశారు. వెంటనే క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు.
పోలీసుల కథనం ప్రకారం.. ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్ నుంచి యాత్రికులతో బస్సు జమ్మూకాశ్మీర్ లోని శివ్ ఖోడికి వెళ్తోంది. ఈ క్రమంలో బస్సు అదుపు తప్పి లోయలో పడింది. బస్సు ఒక్కసారిగా లోయలో పడడంతో అందులో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా కేకలు వేశారు. దీంతో చుట్టుపక్కల ప్రజలు గమనించి వెంటనే అక్కడికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం ఘటనా స్థలికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు నిమిషాల వ్యవధిలో ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేశారని తెలిపారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు.
Also Read: ఫోన్ చేసి పరామర్శించాల్సింది పోయి.. నిందలు వేస్తావా?
ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆమె ఆకాంక్షించారు.