Zomato Hikes | భారతదేశంలోని ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్ ఫామ్ జొమాటో తమ కస్టమర్లకు దీపావళి కానుకగా ఒక గట్టి షాకిచ్చింది. దీపావళి పండుగకు సరిగ్గా కొన్ని రోజుల ముందు ప్లాట్ ఫామ్ ఫీజు పెంచేసింది. గత సంవత్సరం కూడా ఇలాగే పలుమార్లు ఈ ఫీజు పెంచేయడంతో ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్ క్రమంగా ధర పెరిగిపోయింది. ఈ క్రమంలోనే తాజాగా దీపావళికి ధరలు పెంచేయడంతో ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్.. కస్టర్లకు మరింత ప్రియం కానుంది.
జొమాటోలో ప్లాట్ ఫామ్ ఫీజు రూ.10
ఇప్పటివరకు ఉన్న ఫ్లాట్ ఫామ్ ఫీజుకు 60 శాతం పెంచబోతున్నట్లు జొమాట్ల ప్రకటించింది. దీంతో ప్రతి ఆర్డర్ ఫీజు రూ.10కు చేరింది. ఇంతకుముందు ప్రతి ఆర్డర్ కు రూ.6 ఫీజు ఉండగా.. 60 శాతం పెంచేయడంతో ఇప్పుడు రూ.10 కు చేరింది. ఇప్పటికే 2024 సంవత్సరం ప్రారంభంలోనే ప్లాట్ ఫామ్ ఫీజు జొమాటో తాజాగా మరోసారి ధర పెంచేసింది.
జనవరి 2024లో జొమాటో ప్లాట్ ఫామ్ ఫీజు రూ.4 ఉండగా.. ఆ తరువాత రూ.6కు పెంచింది. అయితే యాప్ ద్వారా బుక్ చేసుకునే ప్రతి ఆర్డర్ కు ప్లాట్ ఫామ్ కనీస చార్జ్ రూ.10 చెల్లించాల్సి ఉంటుంది.
Also Read: లారెన్స్ బిష్నోయిని చంపితే రూ.కోటి పదకొండ లక్షలు.. బహిరంగ ప్రకటన చేసిన కర్ణిసేన..
ఒకే సంవత్సరంలో పలుమార్లు ఫీజు పెంపు
జొమాటో ఫుడ్ డెలివరీ కంపెనీ కేవలం ఒక సంవత్సరంలోనే పలుమార్లు ప్లాట్ ఫామ్ ఫీజు పెంచింది. ముందు యూజర్ల నుంచి ప్రతి ఆర్డర్ కు కేవలం రూ.1 మాత్రమే చార్జ్ చేసేది. ఆ తరువాత అది కాస్తా రూ.2, తరువాత రూ.3 గా పెంచింది. ఇక 2023లో అయితే జొమాటో కంపెనీ ఈ చార్జ్ రూ.4కు పెంచింది. ఆ తరువాత జనవరి 2024లో రూ.6కు పెంచేసింది. ఇప్పుడు దీపావళి పండుగ రావడంతో ఆర్డర్ చేసుకునే వారి సంఖ్య కూడా పెరుగుతుంది. దీంతో దీపావళి రష్ ని క్యాష్ చేసుకునేందుకే ప్లాట్ ఫామ్ ఫీజు రూ.10 కు పెంచింది. ఇది జోమాటో ఉద్దేశ పూర్వకంగానే మార్కెటింగ్ చేసినట్లు బిజినెస్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
జోమాటో ఏం చెబుతోంది?
ప్లాట్ ఫామ్ ఫీజు ఏకంగా 60 శాతం పెంచేయడంపై జొమాటో కంపెనీ స్పష్టతనిచ్చింది. దీపావళి, ఇతర పండుగలకు విపరీతంగా ఆన్లైన్ ఆర్డర్స్ వస్తున్నాయి. హై డిమాండ్ కారణంగా.. యాప్ ఆపరేషన్ కాస్ట్, మెయిన్టెనెన్స్ కాస్ట్ బాగా పెరిగిపోయింది. అందుకే ఈ ఖర్చులు పెరిగిపోవడంతో ప్లాట్ ఫామ్ ఫీజు పెంచాలని నిర్ణయం తీసుకున్నాం. దీని వల్ల డెలివరీ బాయ్స్ కూడా పండుగ సమయంలో సంతోషంగా పనిచేస్తారు, కస్టమర్లకు మంచి సర్వీస్ అందుతుందని ఆశిస్తున్నాము.
ఇప్పటికే కస్టమర్లకు ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్ పై చార్జీల మోత మోగుతోంది. జోమాటోలో ఒక అన్లైన్ ఆర్డర్ బుక్ చేస్తే.. ప్లాట్ ఫామ్ ఫీజు రూ.10 చెల్లించడంతోపాటు.. జిఎస్టీ, రెస్టారెంట్ చార్జీలు, డెలివరీ ఫీజు అన్ని కలిపి తడిసి మోపెడవుతుంది. జొమాటో ఫీజు పెంచేయడంతో దానికి పోటీ కంపెనీ స్విగ్గీ కూడా అదే బాటలో నడుస్తోంది. జొమాటో లాగే ప్లాట్ ఫామ్ ఫీజు ప్రతి ఆర్డర్ కు రూ.6.50 చార్జ్ చేస్తోంది. కస్టమర్లకు దీపావళి ఏమో గానీ ఈ ఫుడ్ డెలివరీ కంపెనీలు మాత్రం పండుగ రాక జేబులు నింపుకుంటున్నాయి.