Vande Bharat Sleeper Train Speciality: అత్యాధునిక సదుపాయాలు, అత్యంత వేగంగా ప్రయాణించే వందే భారత్ రైళ్లకు తక్కువ కాలంలోనే ప్రయాణీకుల నుంచి మంచి ఆదరణ లభించింది. ఈ నేపథ్యంలో సరికొత్త వందేభారత్ ట్రైన్లు అందుబాటులో తీసుకురాబోతోంది కేంద్ర ప్రభుత్వం. వందే భారత్ స్లీపర్ ట్రైన్ల పేరుతో కొత్త రైళ్లను ప్రవేశపెట్టబోతోంది. ఈ రైళ్లు రాత్రిపూట ఎక్కువ దూరం ప్రయాణించేందుకు అనుకూలంగా రూపొందించింది. విశాలమైన బెర్తులు, అత్యాధునిక ఇంటీరియర్, చక్కటి టాయిలెట్లు ఉన్నాయి.
ఒక్కో ట్రైన్ లో 16 కోచ్ లు.. 823 బెర్తులు..
త్వరలో అందుబాటులోకి రానున్న వందేభారత్ స్లీపర్ రైల్లో మొత్తం 16 కోచ్ లు ఉంటాయి. 823 బెర్తులు ఉంటాయి. పదకొండు 3 ఏసీ కోచ్ లు(611 బెర్తులు), నాలుగు 2 ఏసీ కోచ్ లు(188 బెర్తులు) ఒక 1ఏసీ కోచ్(24 బెర్తులు) ఉంటాయి. ఈ కోచ్ లను అత్యధునిక టెక్నాలజీతో రూపొందించారు. అన్నీ కోచ్ లు సౌండ్ ఫ్రూప్ గా ఉంటాయి. ప్రయాణీకులకు ఎలాంటి ఇబ్బంది కలగదు. రాత్రిపూట అసౌకర్యం కలగకుండా నిద్రపోవచ్చు.
Also Read: రైల్లో ప్రయాణిస్తున్నారా? టీసీ ఇలా చేస్తే తప్పకుండా ప్రశ్నించవచ్చు, మీకు ఉన్న హక్కులివే!
ట్రైన్ అటెండ్లర్లకు ప్రత్యేక బెర్తులు
వందేభారత్ స్లీపర్ రైళ్లలో ట్రైన్ అటెండెంట్లకు ప్రత్యేక బెర్త్ లు ఉంటాయి. వీలున్నప్పుడు వాళ్లు కొంత విశ్రాంతి తీసుకునే అవకాశం ఉంటుంది. లోకో పైలట్ క్యాబిన్ ఎయిర్ కండిషన్ చేయబడింది. వారి కోసం ప్రత్యేకంగా టాయిలెట్ ఏర్పాటు చేశారు.
త్వరలో చెన్నై ICFకి తొలి స్లీపర్ రైలు
BEML త్వరలో చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF)కి వందేభారత్ తొలి స్లీపర్ రైలును పంపనుంది. ICF రేక్ ఫార్మేషన్, ఫైనల్ టెస్టింగ్ ను నిర్వహిస్తుంది. ఇందుకు సుమారు 20 రోజుల సమయం పట్లే అవకాశం ఉంది. ఆ తర్వాత లక్నోకు చెందిన రైల్వే డిజైన్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ (RDSO) పర్యవేక్షణలో రెండు నెలల పాటు టెస్ట్ రన్ కొనసాగుతుంది. హైస్పీడ్ టెస్టింగ్ కోసం నార్త్ వెస్ట్రన్ రైల్వే జోన్లో ట్రయల్ రన్ నిర్వహించే అవకాశం ఉంది.
విమానం లాంటి సౌకర్యాలు
వందే భారత్ స్లీపర్ రైల్లో విమానంలో మాదిరిగా అత్యాధునిక సౌకర్యాలు ఉంటాయి. ప్రతి స్లీపర్ బెర్త్ లో రీడింగ్ లైట్లు, ఛార్జింగ్ సాకెట్లు, మొబైల్/మ్యాగజైన్ హోల్డర్, స్నాక్ టేబుల్ ఉంటాయి. వందే భారత్ స్లీపర్ రైళ్లలో ఫస్ట్ ఏసీ ప్రయాణికులు వేడి నీటితో స్నానం చేసే సౌకర్యం ఉంటుంది.
రాత్రిపూట చీకట్లో వాష్రూమ్కు వెళ్లే ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా నిచ్చెనలకు ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేశారు. ప్యాంట్రీ కారులో ఓవెన్లు, బాటిల్ కూలర్లు, డెజర్ట్ల కోసం కంపార్ట్మెంట్లు, బాయిలర్లు, కాంపాక్ట్ డస్ట్బిన్లు ఉంటాయి. అన్ని కోచ్ లలో స్టెయిన్ లెస్ స్టీల్ కార్ బాడీలు ఉంటాయి.
కంపార్ట్మెంట్లు అన్నీ ఫైర్ రెసిస్టెంట్, ఆటో మేటిక్ డోర్లును కలిగి ఉంటాయి. అంతేకాదు.. ప్రయాణీకుల భద్రతను పెంచడానికి ప్రత్యేకంగా రూపొందించిన క్రాష్ బఫర్లు, కప్లర్ల లాంటి అధునాతన క్రాష్వర్తీ ఎలిమెంట్స్ ను అమర్చారు. యురోపియన్ ప్రమాణాలతో సమానంగా ఈ రైలును రూపొందిస్తున్నారు. సుదూర ప్రయాణాలకు ఈ రైలు అత్యంత అనుకూలంగా ఉండనుంది.
రాజధానితో సమానంగా టికెట్ ధరలు
సెప్టెంబర్ 1న బెంగళూరులోని BEMLలో తొలి వందే భారత్ స్లీపర్ కోచ్ మోడల్ ను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, సహాయ మంత్రి వి సోమన్న ఆవిష్కరించారు. వందేభారత్ స్లీపర్ టికెట్ ధర రాజధాని ధరలతో సమానంగా ఉంటాయని వైష్ణవ్ తెలిపారు. “వందే భారత్ స్లీపర్ రైళ్లు మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులో ఉంటాయి. వారిని దృష్టిలో పెట్టుకునే ఈ రైలు ఛార్జీలు నిర్ణయిస్తాం. ఇంచుమించు రాజధాని రైళ్లతో సమానంగా టికెట్ ధరలు ఉంటాయి. వందే భారత్ స్లీపర్ రైలు ట్రయల్ రన్ తర్వాత మూడు నెలల్లో ప్యాసింజర్ కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. ఈ రైలు ప్రజల ప్రయాణ విధానాన్ని మారుస్తుంది. భారతీయుల ఆకాంక్షలకు అనుగుణంగా ఉంటుంది. ఈ రైలు రాత్రిపూట 800 కిలో మీటర్ల నుంచి 1,200 కిలో మీటర్ల వేగంతో ప్రయాణించేందుకు అనుకూలంగా ఉంటుంది” అని వైష్ణవ్ తెలిపారు.
టికెట్ ధరల అంచనాలు ఇవే? (Vande Bharat Sleeper Train Ticket Rates)
రాజధాని ఏసీ 3 టైర్ టికెట్ ధర రూ.2360గా ఉంది. ఫస్ట్ ఏసీ రేట్ రూ.5420 వరకు ఉంది. అయితే, దూరాన్ని బట్టి ఈ ధరల్లో వ్యత్యాసం ఉంటుంది. ఇక వందేభారత్ స్లీపర్ రైళ్లకైతే.. రాజధాని రైళ్ల కంటే సుమారు రూ.1000 నుంచి రూ.1500 వరకు ఎక్కువ ధర ఉండవచ్చని తెలుస్తోంది. అంటే.. థర్డ్ ఏసీ కోచ్ టికెట్ ధర రూ.3500 నుంచి రూ.4000, ఫస్ట్ ఏసీ కోచ్ రూ.6000 నుంచి రూ.7000లకు పైగా ఉండే అవకాశాలున్నాయని తెలుస్తోంది. సెకండ్ ఏసీ టికెట్ ధర ఈ రెండు క్లాస్లకు మధ్యలో అటూ ఇటూ ఉండవచ్చు. అయితే, దూరాన్ని బట్టి ఈ ధరలో మార్పులుంటాయి. ఇది కేవలం అంచనా మాత్రమే. ఈ ధరలపై ఇంకా అధికారిక ప్రకటన రావల్సి ఉంది.