Indian Railways Viral News: భారతీయ రైల్వే ప్రజా రవాణాలో కీలకపాత్ర పోషించే సంస్థ. నిత్యం లక్షకు పైగా రైళ్లు కోట్లాది మంది ప్రమాణీకులను తమ గమ్య స్థానాలకు చేర్చుతున్నాయి. సౌకర్యవంతమైన ప్రయాణం, తక్కువ టికెట్ ధరల కారణంగా ప్రజలు ఎక్కువగా రైళ్లలో ప్రయాణం చేసేందుకు మొగ్గుచూపుతున్నారు. వందే భారత్ లాంటి రైళ్లు ఎంట్రీ ఇచ్చాక.. భారతీయ రైల్వే ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. అత్యంత వేగం, లగ్జరీ ప్రయాణం కావడంతో ప్రయాణీకులు వీటిలో ప్రయాణించేందుకు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ప్రయాణీకుల నుంచి వస్తున్న ఆదరణకు తగినట్లుగా రోజు రోజుకు వందే భారత్ రైళ్లను అప్ డేట్ చేస్తూ అందుబాటులోకి తీసుకొస్తున్నారు రైల్వే అధికారులు.
ఒకే టికెట్.. రెండు వేర్వేరు ధరలు
భారతీయ రైల్వేలలో ఛార్జీలు ప్రతి తరగతికి ఒకేలా ఉంటాయి. టికెట్ ధరల్లో ఏమాత్రం తేడాలు ఉండవు. కానీ, తాజాగా జరిగిన ఓ ఘనట ప్రయాణీకులతో పాటు రైల్వే అధికారులను షాక్ కి గురి చేసింది. ఇద్దరు వ్యక్తులు ఒకే స్టేషన్ లో ఎక్కారు. వారు దిగాల్సిన స్టేషన్ కూడా ఒక్కటే. ఇద్దరు వేర్వేరు ఫ్లాట్ ఫారమ్ లలో టికెట్ తీసుకున్నారు. కానీ, ఒకరికి టికెట్ ధర రూ.180 తీసుకోగా, మరొకరికి రూ.205 తీసుకున్నారు. ఇద్దరూ రైలు ఎక్కాక టికెట్ ధరల్లో తేడా చూసి షాక్ అయ్యారు. ఈ విషయం రైల్వే అధికారులకు తెలియడంతో ప్రస్తుతం విచారణ మొదలు పెట్టారు.
అసలు ఏం జరిగిందంటే?
మధ్య ప్రదేశ్ కు చెందిన అన్నదమ్ములు సంజయ్, శ్యామ్ సుందర్ సాగర్ లోని మోహన్ నగర్ లో నివాసం ఉంటున్నారు. ఇద్దరూ జైపూర్ లోని ఓ వేడుకలో పాల్గొనేందుకు వెళ్తున్నారు. అక్టోబర్ 5న సాగర్ నుంచి జైపూర్కు ప్రయాణం చేయాలి. ఇద్దరూ దయోదయ ఎక్స్ ప్రెస్ కు వెళ్లాలి. సంజయ్ రాత్రి 11.42 గంటలకు స్టేషన్ కు చేరుకున్నాడు. ఫ్లాట్ ఫారమ్ 2 లో టికెట్ కొనుగోలు చేశాడు. ఆయన దగ్గర అధికారులు రూ. 205 తీసుకున్నారు. కాసేపటి తర్వాత శ్యామ్ సుందర్ అదే రైల్వే స్టేషన్ కు వచ్చాడు. ఆయన ఫ్లాట్ ఫారమ్ 1లో టికెట్ తీసుకున్నాడు. ఆయన దగ్గర అధికారులు రూ. 180 తీసుకున్నారు. ఇద్దరూ రైలు ఎక్కారు. జర్నీ చేస్తుండగా రైలు టికెట్ల ప్రస్తావన వచ్చింది. తమ టికెట్లను చెక్ చేసుకున్నారు. ఇద్దరు టికెట్లలో ధరలు తేడాగా ఉండటంతో షాక్ అయ్యారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
విచారణ మొదలు పెట్టిన రైల్వే అధికారులు
టికెట్ ధరల్లో తేడా విషయం అధికారుల దృష్టికి వెళ్లడంతో విచారణ మొదలు పెట్టారు. జబల్పూర్ రైల్వే స్టేషన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ మధుర్ వర్మ ఈ అంశంపై స్పందించారు. సాగర్ నుంచి జైపూర్కు అధికారిక ధర రూ. 205గా ఉన్నట్లు వెల్లడించారు. పొరపాటు కారణంగారూ. 180 తీసుకున్నట్లు చెప్పారు. ఈ విషయంపై విచారణ జరుగుతుందన్నారు. సిబ్బందికి కౌన్సెలింగ్ ఇస్తున్నట్లు వర్మ వెల్లడించారు.
Read Also: ఒకే టికెట్ తో 56 రోజుల ప్రయాణం- దేశం అంతా చుట్టేయొచ్చు, ధర కూడా తక్కువేనండోయ్!