Special Railway Station In India: భారత్ లోని ఏ రైల్వే స్టేషన్ లోకైనా ఈజీగా వెళొచ్చు. ఫ్లాట్ ఫారమ్ టికెట్ ఉంటే ఎవరూ ఏం అడగరు. బంధువులను రైలు ఎక్కించడానికో.. లేదంటే వచ్చిన వారిని రిసీస్ చేసుకోవడానికో తరచుగా రైల్వే స్టేషన్ కు వెళ్తూనే ఉంటాం. కానీ, భారత్ లో ఓ స్పెషల్ రైల్వే స్టేషన్ ఉంది. ఇక్కడికి ఇష్టం వచ్చినట్లు వెళ్తాం అంటే అస్సలు కుదరదు. ఈ స్టేషన్ లోకి వెళ్లాలంటే కచ్చితంగా పాస్ పోర్టు, వీసా ఉండాల్సిందే. ఇవి రెండూ లేకుండా కనీసం పరిసరాలకు కూడా రానివ్వరు అక్కడి భద్రతా సిబ్బంది. ఇంతకీ.. ఈ రైల్వే స్టేషన్ ఎక్కడుందో ఇప్పుడు తెలుసుకుందాం..
అట్టారి శ్యామ్ సింగ్ రైల్వే స్టేషన్ వెరీ స్పెషల్
పాస్ పోర్టు, వీసా ఉంటేనే ప్రయాణీకులను లోపలికి అనుమతించే ఏకైక రైల్వే స్టేషన్ పంజాబ్లో ఉంది. దాని పేరే అట్టారి శ్యామ్ సింగ్ రైల్వే స్టేషన్. ఈ రైల్వే స్టేషన్ భారత్- పాక్ సరిహద్దుకు సమీపంలో ఉన్నది. ఈ నేపథ్యంలోనే ఈ రైల్వే స్టేషన్ ను సున్నితమైన ప్రదేశంగా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. అమృత్ సర్-లాహోర్ లైన్ లో రైలు ప్రయాణం ఈ స్టేషన్ నుంచే మొదలవుతుంది. ఇక్కడ రైలు ఎక్కితే పాకిస్తాన్ కు వెళ్లొచ్చు. పాకిస్తాన్ లోని లాహోర్ లో రైలు ఎక్కితే భారత్ కు రావచ్చు. అందుకే, ఈ రైల్వే స్టేషన్ స్పెషల్ సెక్యూరిటీ ప్రోటోకాల్ ను కలిగి ఉంటుంది.
స్టేషన్ లోకి వెళ్లాలంటే పాస్ పోర్ట్, వీసా తప్పనిసరి
అట్టారి శ్యామ్ సింగ్ రైల్వే స్టేషన్ లోకి ప్రవేశించాలంటే భారత పాస్ పోర్టుతో పాటు పాకిస్తాన్ వీసా తప్పనిసరి. పాకిస్తాను నుంచి ఇక్కడికి రావాలంటే పాక్ పాస్ పోర్టులతో పాటు భారత వీసా తప్పనిసరి. గతంలో భారత్ -పాక్ మధ్య సంఝౌతా ఎక్స్ ప్రెస్ రైలు నడిచేది. ఈ రైలును నార్త్ రైల్వేలోని ఫిరోజ్ పూర్ డివిజన్ పర్యవేక్షించేది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల కారణంగా ఈ రైలును భారత్ సస్పెండ్ చేసింది. అయినప్పటికీ ఇక్కడ ప్రత్యేక భద్రతా బలగాలు 24 గంటలు పహారా కాస్తుంటాయి. ఈ రైల్వేస్టేషన్ పూర్తిగా సీసీ టీవీల పర్యవేక్షణలో ఉంటుంది. ఈ స్టేషన్ గురించి కేంద్ర ప్రభత్వం నిర్వహించే అమృత్ మహోత్సవ్ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ కూడా వివరించింది. భారత్ లో వీసా ఉంటేనే లోపలికి అనుమతించే ఒకే ఒక్క రైల్వే స్టేషన్ అట్టారి రైల్వే స్టేషన్ అని వెల్లడించింది.
నిరంతరం భద్రతా బలగాల గస్తీ
అట్టారి రైల్వే స్టేషన్ వాఘా సరిహద్దుకు కూతవేటు దూరంలో ఉంటుంది. అంతేకాదు, ఇవరు దేశాల మధ్య ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు ఇక్కడి నుంచే ఉంటాయి. అందుకే, ఈ రైల్వే స్టేషన్ భద్రతా బలగాల పర్యవేక్షణలో ఉంటుంది. స్టేషన్ లో సైనిక సిబ్బంది నిరంతరం గస్తీ కాస్తుంటారు. ప్రయాణీకులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. అనుమానిత వ్యక్తులను, వస్తువులు కనపడితే వెంటనే అదుపులోకి తీసుకుంటారు. అందుకే, ఈ రైల్వే స్టేషన్ భారత్ లో స్పెషల్ స్టేషన్ గా గుర్తింపు తెచ్చుకుంది.