Caller ID Feature:ప్రస్తుతం స్మార్ట్ ఫోన్లు వాడే వాళ్లు… ట్రూ కాలర్ లాంటి యాప్స్ ద్వారా… తమకు వచ్చే కాల్స్ ఎవరు చేస్తున్నారో గుర్తిస్తున్నారు. ఇకపై అలాంటి యాప్స్ అవసరం లేకుండా… ఫోన్ చేసే వాళ్లు ఎవరో కాల్ రిసీవ్ చేసుకునే వాళ్లు తెలుసుకునేలా… ఐడెంటిఫికేషన్ ఫీచర్ను తీసుకురావాలనే ప్రతిపాదనను… టెలికాం కంపెనీల ముందు పెట్టింది… ట్రాయ్. దీనిపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి… టెలికాం కంపెనీలు.
స్మార్ట్ ఫోన్లలోనే కాదు, ఫీచర్ ఫోన్లలోనూ… కాల్ ఐడెంటిఫికేషన్ ఫీచర్ తీసుకురావాలనేది ట్రాయ్ ఆలోచన. దీని కోసం టెలికాం కంపెనీల దగ్గరుండే రిజిస్ట్రేషన్ డేటాను వినియోగించాలని భావించింది. అయితే, ఈ ఫీచర్ విషయంలో టెలికాం కంపెనీలు ప్రతికూలంగా స్పందించాయి. కాలింగ్ నేమ్ ప్రజంటేషన్-సీఎన్ఏపీ పేరుతో వస్తున్న ఈ ఫీచర్ వల్ల… వినియోగదారుల గోప్యతకు భంగం వాటిల్లుతుందని వాదిస్తున్నాయి. అంతేకాదు… సాంకేతికంగా కూడా కొన్ని అడ్డంకులు ఉన్నాయని అంటున్నాయి. కాల్ ఐడెంటిఫికేషన్ ఫీచర్పై తమ అభ్యంతరాలను జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా, బీఎస్ఎన్ఎల్ వేర్వేరుగా ట్రాయ్కి తెలియజేశాయి.
కాల్ ఐడెంటిఫికేషన్ ఫీచర్ వల్ల డేటా గోప్యత, సాంకేతిక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని జియో అభిప్రాయపడింది. చాలా ఫోన్లు కాలింగ్ నేమ్ ప్రజెంటేషన్కు సపోర్ట్ చేయవని, ఆపరేటింగ్ సిస్టమ్ నుంచి కూడా ఇబ్బందులు ఉన్నాయని ట్రాయ్కి తెలియజేసింది. నెట్వర్క్పై కూడా భారం పడుతుందని పేర్కొంది. ఇక ఎయిర్టెల్… వ్యక్తిగత భద్రతకు సంబంధించిన సమస్యలు తలెత్తుతాయని తెలిపింది. కాల్ సెటప్ సమయం ఎక్కువగా తీసుకోవడం వల్ల యూజర్లు అసౌకర్యానికి గురయ్యే అవకాశం ఉంటుందని అభిప్రాయపడింది. ఈ ఫీచర్ కోసం ప్రత్యేకంగా డేటా స్టోర్ చేయాల్సి ఉంటుందని… అది టెల్కోలకు అదనపు భారమని వాదించింది. ఇక బీఎస్ఎన్ఎల్ అయితే… కాలర్ ఐడీ ఫీచర్ని తప్పనిసరి చేయటం సరైనది కాదని ట్రాయ్కి తెలిపింది. ఒకవేళ ప్రవేశపెట్టాల్సి వస్తే… ఆరంభంలో దాన్ని వాల్యూ యాడెడ్ సర్వీసుగా అందించాలని పేర్కొంది. జియో, ఎయిర్టెల్, బీఎస్ఎన్ఎల్ తరహాలోనే వొడాఫోన్ ఐడియా కూడా అభ్యంతరాలను వ్యక్తం చేసింది. ఎల్టీఈ నెట్వర్క్ ఫీచర్ అని… 2G, 3G నెట్వర్క్కు అనుసంధానం చేయడం సాధ్యంకాదని తెలిపింది. దీని కోసం నెట్వర్క్, ఐటీ సిస్టమ్స్ను వినియోగించాల్సి ఉంటుందని తెలిపింది.