Anil Ambani SEBI| ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీపై షేర్ మార్కెట్ నియంత్రణ బోర్డు సెబీ(సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) రూ.25 కోట్ల భారీ జరిమానా విధించింది. దీంతో పాటు మరో అయిదేళ్లు షేర్ మార్కెట్లో లావాదేవీలు చేయకుండా నిషేధం విధించింది. అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ అనే కంపెనీ నుంచి నిబంధనలకు వ్యతిరేకంగా నిధులు మళ్లించినందుకు సెబీ కఠినంగా వ్యవహరించింది. అనిల్ అంబానీతోపాటు మరో 24 కంపెనీలపై ఈ నిషేధం విధించింది.
కంపెనీ నిధులు మళ్లించినందుకు అనిల్ అంబానీపై జరిమానా, నిషేధం విధించడంతోపాటు.. ఆయనను మరి ఏ ఇతర కంపెనీలో కూడా డైరెక్టర్ గా పదవి చేపట్టకూడదని ఆంక్షలు విధించింది. ఈ అంక్షలు పరిమితి అయిదేళ్ల వరకు ఉంటుంది. అంతేకాకుండా ఆయన కంపెనీ రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ షేర్లు ఆరు నెలల వరకు ట్రేడింగ్ లో ఉండకూడదని చెబుతూ కంపెనీపై రూ.6 లక్షలు ఫైన్ విధించింది.
సెబీ జారీ చేసిన 222 పేజీల ఆర్డర్ రిపోర్ట్ ప్రకారం.. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ కంపెనీలో ఉన్నత పదవిలో ఉన్న అనిల్ అంబానీ.. కంపెనీ నిధులను మోసపూరితంగ తన ఇతర కంపెనీలకు లోన్ల రూపంలో మళ్లించాడు. ఈ విషయంలో రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు అతనికి వార్నింగ్ ఇచ్చినా.. నిర్లక్ష్యంగా వ్యవహరించాడని తెలిసింది. పైగా ఆ వందల కోట్లు లోన్లు తీసుకున్న కొత్త కంపెనీలన్నీ నకిలీవని వాటికి సరైన ఆస్తులు లేవని తేలింది. దీంతో రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ కంపెనీలో తన చైర్మన్ పదవిని అనిల్ అంబానీ దుర్వినియోగం చేశారని నిర్ధారిస్తూ.. సెబీ అతనిపై భారీ జరిమానా విధిస్తూ.. మార్కెట్లో లావాదేవీలు చేయకుండా అయిదేళ్ల పాటు ఆంక్షలు విధించింది.
రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ కంపెనీ నుంచి లోన్లు తీసుకున్న అనిల్ అంబానీ అనుబంధ కంపెనీలు సమయానికి రుణాలు తిరిగి చెల్లించలేదు. దీంతో రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ కంపెనీకి చెందిన 9 లక్షల షేర్ హోల్డర్లు తమ పెట్టుబడులపై భారీ నష్టాలు చవిచూడాల్సి వచ్చింది.
అయితే ఈ మొత్తం వ్యవహారంలో మోసపూరితంగా లోన్లు తీసుకున్న మరో 24 కంపెనీలపై కూడా సెబీ కొరడా ఝూళిపించింది. అనిల్ అంబానీతో పాటు ఆయన సన్నిహితులు, ఆయన నేరం భాగస్వాములు అయిన అమిత్ బాప్నా, రవీంద్ర సుధాల్కర్, పింకేశ్ ఆర్ షాలపై భారీ జరిమనాలు విధించింది.
అనిల్ అంబానీపై రూ.25 కోట్లు ఫైన్ విధించినట్లుగా, అమిత్ బాప్నాపై రూ.27 కోట్లు, సుధాల్కర్ పై రూ.26 కోట్లు, పింకేశ్ షా పై రూ.21 కోట్లు ఫైన్ విధించింది. మిగతా కంపెనీలలో రిలయన్స్ యూనికార్న్ ఎంటర్ ప్రైజెస్, రిలయన్స్ ఎక్సెఛేంజ్ నెక్స్ట్ లిమిటెడ్, రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ లిమిటెడ్, రిలయన్స్ క్లీన్ జెన్ లిమిటెడ్, రిలయన్స్ బిజినెస్ బ్రాడ్ కాస్ట న్యూస్ హోల్డింగ్స్ లిమిటెడ్, రిలయన్స్ బిగ్ ఎంటర్ టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ లపై తలా రూ.25 కోట్లు జరిమానా విధించింది.
Also Read: ట్రైన్ లేట్ అయితే మీ డబ్బులు ఫుల్ రిఫండ్.. షరతులు వర్తిస్తాయి!
వీరిలో కొందరిలో మోసపూరితంగా వందల కోట్లు లోన్లు తీసుకున్న వారు కాగా మరికొందరు లోన్లు తీసుకునే కుట్రలో సహకరించినవారు.
గతంలో ఫిబ్రవరి 2022లో కూడా అనిల్ అంబానీ ఆయన సన్నిహితులైన అమిత్ బాప్నా, రవీంద్ర సుధాల్కర్, పింకేశ్ షా లను కంపెనీ నిధులు మళ్లించారనే అభియోగం కారణంగా సెక్యూరిటీస్ మార్కెట్ నుంచి ఆరు నెలల పాటు సెబీ నిషేధం విధించింది.
Also Read: ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలనుకుంటున్నారా?.. అత్యధిక వడ్డీ రేటు ఏ బ్యాంకు ఇస్తుందో తెలుసా?