RBI Key Repo Rate:
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) 2023-24 ఆర్థిక సంవత్సరానికి చివరి ద్రవ్య విధానాన్ని ప్రకటించింది. ఈసారి కూడా రెపో రేటులో ఎలాంటి మార్పు లేదు. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోని ద్రవ్య విధాన కమిటీ (MPC) సమీక్షా సమావేశం అనంతరం ఈ విషయాన్ని ప్రకటించింది. రెపో రేటు 6.5 శాతం వద్ద స్థిరంగా ఉంది. ఈసారైనా రుణాలపై వడ్డీరేట్ల నుంచి ఉపశమనం లభిస్తుందో లేదోనని ఎదురుచూసిన వారికి నిరాశే మిగిలింది. రెపోరేటులో ఎలాంటి మార్పు లేకపోవడంతో.. రుణాలపై వడ్డీలు అలాగే ఉండనున్నాయి. ఆర్బీఐ రెపో రేటును తగ్గించినట్లయితే, సామాన్య ప్రజలకు రుణవాయిదాలపై కాస్త ఉపశమనం ఉండేది.
నిపుణుల అంచనాల ప్రకారం.. ఈసారి కూడా ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ఇటీవల యూఎస్ ఫెడ్, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ కూడా రేట్లలో ఎటువంటి మార్పు చేయలేదు.ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీలోని ఆరుగురు సభ్యుల్లో 5 మంది రెపో రేటును మార్చకూడదని నిర్ణయం తీసుకున్నారు. MSFలో కూడా ఎటువంటి మార్పు లేదు. ఇది 6.75 శాతం వద్ద స్థిరంగా ఉంది.
ద్రవ్యోల్బణం రేటు లక్ష్య పరిధిలోకి వస్తోందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. ద్రవ్యోల్బణం రేటు లక్ష్యం 2-6 శాతం ఉంది. ప్రపంచవ్యాప్తంగా, వ్యాపార వేగం బలహీనంగానే ఉన్నా.. రికవరీ సంకేతాలు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. 2024లో ప్రపంచ వృద్ధి స్థిరంగా ఉండవచ్చని ఆర్బీఐ గవర్నర్ పేర్కొన్నప్పటికీ, వివిధ రంగాల్లో దాని వేగం భిన్నంగా ఉంటుంది. ద్రవ్యోల్బణం పెరుగుదల వేగం తగ్గుముఖం పట్టి.. మరింత తగ్గే అవకాశాలు ఉన్నాయి.
RBI MPC సమావేశం ముఖ్య అంశాలు:
ద్రవ్యోల్బణం రేటు లక్ష్య పరిధిలోకి వస్తోందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. ద్రవ్యోల్బణం రేటు లక్ష్యం 2-6 శాతం ఉందన్నారు. ఇప్పటికే ఉన్న అప్పుల గురించి ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఆర్బీఐ గవర్నర్ ప్రకారం.. ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల మధ్య అధిక స్థాయి ప్రజా రుణాలు.. కొన్ని పెద్ద దేశాలలో కూడా ఆర్థిక స్థిరత్వంపై తీవ్రమైన ఆందోళనలను పెంచుతున్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలలో కంటే.. అభివృద్ధి చెందిన దేశాల్లోనే ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తోంది.
GDP నిష్పత్తికి ప్రపంచ ప్రజారుణం ఈ దశాబ్దం చివరి నాటికి 100 శాతానికి చేరుతుందని అంచనా వేయబడింది. అధిక వడ్డీ రేట్లు, ప్రపంచవ్యాప్తంగా వృద్ధి మందగమనం.. కొత్త స్థాయిలో ఒత్తిడిని సృష్టిస్తున్నాయని ఆయన అన్నారు. అటువంటి పరిస్థితిలో రుణ భారాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు. తద్వారా గ్రీన్ ట్రాన్సిషన్తో సహా ముఖ్యమైన ప్రాధాన్యతా రంగాలలో కొత్త పెట్టుబడులకు అవకాశం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు.