Capita Income : భారతదేశ తలసరి ఆదాయం భారీగా పెరిగింది. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటితో పోలిస్తే… ప్రస్తుతం రెట్టింపు అయింది. ఇప్పుడు దేశ తలసరి ఆదాయం ప్రస్తుత ధరల దగ్గర రూ.1,72,000కు చేరిందని జాతీయ గణాంక కార్యాలయం ప్రకటించింది. 2014-15లో రూ.86,647గా ఉన్న తలసరి ఆదాయం… దాదాపు 99 శాతం వృద్ధి చెందింది. ఇక 2014-15లో స్థిర ధరల దగ్గర రూ.72,805గా ఉన్న దేశ తలసరి ఆదాయం… 33 శాతం వృద్ధి చెంది ప్రస్తుతం రూ.98,118కి చేరింది.
ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటే ప్రస్తుత ధరల దగ్గర తలసరి ఆదాయంలో పెరుగుదల చాలా తక్కువని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. ఎక్కువ సంపద కలిగిన 10 శాతం మంది జనాభా వల్లే… తలసరి ఆదాయం భారీగా పెరిగిందని అంటున్నారు. అంతేకాదు… సగటు వేతనాలు పడిపోయాయని, నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ గణాంకాల ప్రకారం కరోనా సమయంలో ప్రస్తుత ధరలు, స్థిర ధరల దగ్గర తలసరి ఆదాయం గణనీయంగా పడిపోయిందని చెబుతున్నారు.
ఇక వరల్డ్ డెవలప్మెంట్ ఇండికేటర్ డేటా బేస్ ప్రకారం.. స్థిర ధరల దగ్గర భారత తలసరి ఆదాయం 2014-2019 మధ్య ఏటా 5.6 శాతం వృద్ధి చెందింది. ఇది చాలా గణనీయ వృద్ధి అని పేర్కొన్న నిపుణులు… విద్య, వైద్యం, ఆర్థిక రంగాల్లో మెరుగైన వృద్ధి సాధించడం వల్లే ఇది సాధ్యమైందంటున్నారు. స్థిర ధరల దగ్గర తలసరి ఆదాయం ఎగబాకడం దేశంలో పెరుగుతున్న సంపదకు నిదర్శనమని చెబుతున్నారు. తలసరి ఆదాయం దేశ ప్రజల ఆదాయాల సగటు అయినప్పటికీ… అది ఎప్పుడూ ఆర్థిక అసమానతలను ప్రతిబింబించదని అంటున్నారు. తలసరి ఆదాయం పెరిగినా… పేద వారి పరిస్థితిలో పెద్దగా మార్పు ఉండబోదంటున్నారు. అయితే, ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్న ఇతర దేశాలతో పోల్చి చూస్తే… భారత్ పరిస్థితి మాత్రం బాగానే ఉందంటున్నారు.