Anant – Radhika Pre Wedding Celebrations : భారతదేశ అపర కుబేరుడు, కలియుగ సంపన్నుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముకేశ్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ (Anant Ambani), ఎన్ కోర్ హెల్త్ కేర్ సీఈఓ వీరేన్ మర్చంట్ కుమార్తె రాధిక మర్చంట్ (Radhika Merchant) ప్రీ వెడ్డింగ్ వేడుకలు నేటి నుంచి (March 1) జామ్ నగర్ లో ప్రారంభం కానున్నాయి. ముకేశ్ అంబానీ కుటుంబంలో ఈ తరంలో జరిగే ఆఖరి పెళ్లివేడుక, అనంత్ అంబానీ పెళ్లి కావడంతో.. ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా జామ్ నగర్ కు వస్తున్న ప్రముఖులతో సందడి వాతావరణం నెలకొంది. కుమారుడి ప్రీ వెడ్డింగ్ వేడుకల నేపథ్యంలో.. నీతా అంబానీ ఒక ప్రత్యేక వీడియోను నెటిజన్లతో పంచుకున్నారు.
చిన్న కుమారుడు అనంత్ – రాధికల పెళ్లి వేడుక సందర్భంగా ఆమెకు రెండు కోరికలున్నాయని తెలిపారు. ఒకటి.. మన మూలాలను గుర్తుంచుకునేలా వేడుకలు నిర్వహించడం, రెండవది.. ఈ పెళ్లివేడుక మన కళలు, సంస్కృతి, దేశ వారసత్వాన్ని ప్రతిబింబించేలా ఉండాలని కోరుకున్నామన్నారు. అలాగే జామ్ నగర్ తన కుటుంబానికి ఎంతో ఇష్టమైన ప్రదేశమని, తాను కూడా కెరీర్ ను అక్కడి నుంచే ప్రారంభించినట్లు చెప్పుకొచ్చారామె.
Read More : అంబానీయా మజాకా.. వెయ్యి కోట్లతో పెళ్లి..!
ఇక అనంత్ – రాధిక ల ప్రీ వెడ్డింగ్ వేడుకల విషయానికొస్తే.. సినీ తారలు, రాజకీయ, వ్యాపార రంగాల ప్రముఖులు జామ్ నగర్ కు క్యూ కట్టారు. దేశ, విదేశాల నుంచి వచ్చే ప్రముఖులను ఆహ్వానించేందుకు.. అంబానీ ఫ్యామిలీ స్వాగత తోరణాలను ఏర్పాటు చేసింది. శుక్రవారం ఉదయం మెటా అధినేత మార్క్ జుకర్ బర్గ్.. తన భార్య ప్రిసిల్లా చాన్ తో కలిసి జామ్ నగర్ కు చేరుకోగా.. వారిని సంప్రదాయ పద్ధతిలో ఆహ్వానించారు. ఇప్పటికే.. రణ్ వీర్ సింగ్ – దీపికా పరుకొణె, రాణి ముఖర్జీ, షారుఖ్ ఖాన్ కుటుంబం, అర్జున్ కపూర్, అలియా -రణబీర్ ఫ్యామిలీ, డైరెక్టర్ అట్లీ, పాప్ సింగర్ రిహన్నా కూడా జామ్ నగర్ కు చేరుకున్నారు. ఖతార్ ప్రధాని మహమ్మద్ బిన్ అబ్దుల్ రహ్మాన్ బిన్ జాసిమ్ అల్ థానీ, భూటాన్ రాణి జెట్సన్ పెమా, మెటా సీఈఓ మార్క్ జుకర్ బర్గ్, అడోబ్ సీఈఓ శంతను నారాయణ్, సౌదా అరాంకో చైర్ పర్సన్ యాసిర్ అల్ రుమయ్యన్, ట్రంప్ కుమార్తె ఇవాంకా తదితరులు కూడా ప్రీ వెడ్డింగ్ వేడుకలకు హాజరు కానున్నారు.
సాయంత్రం 5.30 గంటల నుంచి అనంత్ – రాధిక ల ప్రీ వెడ్డింగ్ వేడుకలు ప్రారంభం కానున్నాయి. శుక్ర, శని, ఆదివారాలు ఈ వేడుకలు సంప్రదాయబద్ధంగా, అట్టహారంగా జరగనున్నాయి. ఈ వేడుకల్లో అతిథులకు వడ్డించే వంటకాలను చూస్తే.. ఎవరైనా నోరెళ్లబెట్టాల్సిందే. తిన్నదే మళ్లీ తినకుండా.. అతిథులకు అన్నిరకాల వంటలను రుచిచూపించనుంది అంబానీ ఫ్యామిలీ.. ఒక్కో ప్లేట్ కాస్ట్ రూ.15 నుంచి ప్రారంభం అంటే.. మామూలుగా ఉండదు మరి. ఇటీవలే అనంత్ – రాధికలు స్థానికుల ఆశీర్వాదం కోరుతూ.. గుజరాతీ సంప్రదాయ వంటకాలతో స్థానికులకు అన్నదాన సేవను నిర్వహించారు. జామ్ నగర్ రిలయన్స్ టౌన్ షిప్ సమీపంలో ఉన్న జోగ్వాడ్ గ్రామంలో 51 వేల మంది స్థానికులకు అన్నదానం చేశారు.
కాగా.. 2023 జనవరిలో వీరి నిశ్చితార్థం ముంబయిలోని యాంటిలియాలో జరిగిన విషయం తెలిసిందే. ఈ ఏడాది జులై 12న వీరిద్దరూ వివాహబంధంతో ఒక్కటి కానున్నారు.