Most Expensive Luxury Train In India: దేశ ప్రజా రవాణా వ్యవస్థలో భారతీయ రైల్వేలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే వ్యవస్థలలో ఒకటిగా గుర్తింపు తెచ్చుకున్న ఇండియన్ రైల్వేస్ నిత్యం 3 కోట్ల మందిని తమ గమ్యస్థానాలకు చేర్చుతుంది. తక్కువ ధరతో సౌకర్యవంతమైన ప్రయాణం చేసే అవకాశం ఉండటంతో చాలా మంది రైల్లో ప్రయాణించేందుకు మొగ్గు చూపుతారు. ఓవైపు తక్కువ ఛార్జీలతో ప్రజలను గమ్యస్థానలకు తీసుకెళ్లే భారతీయ రైల్వే సంస్థ.. అత్యంత ఖరీదైన విలాసవంతమైన ప్రయాణాలనూ అందిస్తున్నది. రీసెంట్ గా అందుబాటులోకి వచ్చిన వందే భారత్ సహా, రాజధాని, శతాబ్ది లాంటి రైళ్లలో టికెట్ రేట్లు కాస్త ఎక్కువగానే ఉంటాయి. మంచి ప్రయాణ అనుభావాన్ని కలిగిస్తాయి. కానీ, వీటన్నింటిని తలదన్నే ఓ ట్రైన్ గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రైలులో టికెట్ ధర ఎంతో తెలిస్తే కచ్చితంగా షాక్ అవుతారు. ఇందులో ప్రయాణించాలంటే మనమైతే ఆస్తులు అమ్ముకోవాల్సిందే! ఇంతకీ ఆ రైలు ఏది? దాని ప్రత్యేకతలు ఏంటి? అనేది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
మహారాజా ఎక్స్ ప్రెస్.. టికెట్ ధర రూ. 20 లక్షలు
భారత్ లో అత్యంత విలాసవంతమైన ప్రయాణాన్ని అందించే రైలు ‘మహారాజా ఎక్స్ ప్రెస్’. ఈ రైలును 2010లో ప్రారంభించారు. ఆసియాలోనే అత్యంత ఖరీదైన లగ్జరీ రైలుగా గుర్తింపు తెచ్చుకుంది. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ రైలు నడుస్తుంది. ఈ రైలులో ఛార్జీలు లక్షల్లో ఉంటాయి. ధరకు తగినట్లుగానే అత్యంత విలావసవంతమైన ప్రయాణ అనుభవాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఈ రైలులో కల్పించే వసతులు ఫైవ్ స్టార్ హోటళ్లను తలదన్నేలా ఉంటాయి. ఇందులోని ఇంటీరియర్ కళ్లు చెదిరేలా ఉంటుంది. ఈ రైల్లో ప్రయాణించే వారికి వెండి పాత్రల్లో భోజనం వడ్డిస్తారు. ప్రతి కోచ్ లో షవర్లతో కూడిన బాత్ రూములు ఉంటాయి. రెండు మాస్టర్ బెడ్ రూమ్ లు ఇస్తారు. ప్రతీ కోచ్లో మినీ బార్ ఉంటుంది. లైవ్ టీవీ, ఏసీ, బయట ప్రదేశాలను చూసేందుకు విశాలమైన గ్లాస్ విండోలు ఉంటాయి. ఈ రైలులోని ప్రెసిడెన్షియల్ సూట్ అత్యంత విలాసవంతంగా ఉంటుంది. ఈ సూట్ లో ఒక్కో టికెట్ ధర ఏకంగా రూ. 20 లక్షలు ఉంటుంది.
Read Also: దేశంలోనే అతి చిన్న రైల్వే ప్లాట్ఫామ్.. ఇక్కడ రైలు ఎక్కాలంటే తిప్పలే, మరి పొడవైనది ఎక్కడుంది?
ప్రముఖ పర్యాటక ప్రాంతాలను కలుపుతూ..
ఈ రైలులో టికెట్ తీసుకున్న వాళ్లు 7 రోజుల పాటు ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలను కలుపుతూ వెళ్తుంది. తాజ్ మహల్, ఖజురహో టెంపుల్, రణతంబోర్, వారణాసిలోని పుష్కర ఘాట్లతో పాటు దేశంలోని పలు ప్రసిద్ధ ప్రదేశాలకు తీసుకెళుతుంది. ప్రస్తుతం ఈ రైలు నాలుగు మార్గాల్లో నడుస్తున్నది. ముఖ్యంగా విదేశీ పర్యాటలకు ఇందులో జర్నీ చేసేందుకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు.
Read Also: రైల్లో బ్లాంకెట్స్ కప్పుకుంటున్నారా? జాగ్రత్త, ఓ షాకింగ్ విషయం బయటపడింది!