These People Get Huge Discounts On Train Tickets: భారతీయ రైల్వే సంస్థ ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద రైల్వే వ్యవస్థ. దేశ వ్యాప్తంగా రోజూ సుమారు 2.5 కోట్ల మంది ప్రయాణీకులు తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. ఇతర ప్రయాణ ఖర్చులతో పోల్చితే తక్కువ ధర, ఆహ్లాదకరమైన జర్నీ అవకాశం ఉండటంతో ఎక్కువ మంది రైళ్లలో ప్రయాణించేందుకు ఇష్టపడుతున్నారు. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండటంతో ఈ రోజుల్లో చాలా మంది టిక్కెట్లను ఆఫ్ లైన్ కంటే ఆన్ లైన్ ద్వారానే ఎక్కువగా బుక్ చేసుకుంటున్నారు. రైల్వే సంస్థ సైతం రిజర్వేషన్ చేయించుకునే ప్రయాణీకులకు తగ్గింపు ధరలో టిక్కెట్లు అందిస్తోంది. అంతేకాదు, భారతీయ రైల్వే సంస్థ పలువురు ప్రయాణీకులకు టికెట్ ధరపై పెద్ద మొత్తంలో రాయితీ అందిస్తోంది. ఇంతకీ రైల్వే సంస్థ ప్రత్యేకంగా ఎవరికి మినహాయింపు ఇస్తుంది? ఎంత మినహాయింపు ఇస్తుంది? మినహాయింపులకు సంబంధించి రైల్వే సంస్థ రూపొందించిన నియమాలు ఏంటి? అనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
మినహాయింపులకు సంబంధించిన నియమాలు
భారతీయ రైల్వేలో కొన్ని నిబంధనల ప్రకారం, కొంతమంది ప్రయాణీకులకు ఛార్జీలలో రాయితీ కల్పిస్తోంది. టిక్కెట్ బేసిక్ ఛార్జీపై పెద్ద మొత్తంలో రాయితీ ఇస్తుంది. అయితే, ఏ రైల్లో ప్రయాణిస్తున్నారు అనే విషయంపై ఆధారపడి ఈ మినహాయింపులు ఉంటాయి. సూపర్ ఫాస్ట్ రైలు, ఎక్స్ ప్రెస్ రైలు, స్పెషల్ రైళ్లు సహా ఇతర రైల్వే సర్వీసులలోనూ ఈ మినహాయింపులు పొందే అవకాశం ఉంటుంది. ఎంత అనేది ఆయా రైళ్లను బట్టి మారుతూ ఉంటుంది.
ఎవరికి మినహాయింపు లభిస్తుంది?
భారతీయ రైల్వే నిబంధనల ప్రకారం విద్యార్థులు, దృష్టి లోపం ఉన్నవారు, దివ్యాంగులు, పారా పెలాజిక్ వ్యక్తులు, టీబీ, క్యాన్సర్ రోగులు, కిడ్నీ, లెప్రసీ రోగులకు ఛార్జీలో రాయితీలు ఇస్తుంది. ఉగ్రవాదులు దాడిలో చనిపోయిన భద్రతా దళాల సతీమణులు, యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన సైనికుల భార్యలు, జాతీయ అవార్డు పొందిన ఉపాధ్యాయులు, లేబర్ అవార్డు విజేతలు, పోలీసు అమరవీరుల భార్యలు, సీనియర్ సిటిజన్లు సహా మరికొంత మంది టిక్కెట్ ధరలో రాయితీ పొందే అవకాశం ఉంటుంది.
టిక్కెట్ ధరలో ఎంత డిస్కౌంట్ పొందే అవకాశం ఉంది?
ఆయా ప్రభుత్వ పరీక్షలు రాసే విద్యార్థులకు పెద్ద మొత్తంలో రాయితీ అందిస్తోంది రైల్వే సంస్థ. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ప్రవేశ పరీక్ష కోసం రైలు ప్రయాణంలో 75 శాతం వరకు రాయితీని పొందే అవకాశం ఉంటుంది. అటు UPSC, సెంట్రల్ స్టాఫ్ సెలక్షన్ కమీషన్ మెయిన్స్ ఎగ్జామ్ కు హాజరయ్యే విద్యార్థులకు టిక్కెట్ ధరలో 50 వరకు రాయితీ పొందవచ్చు. గుండె సంబంధ వ్యాధులు, కిడ్నీ రోగులు, క్యాన్సర్ పేషెంట్లతో సహా రైల్వే గుర్తించిన జబ్బులతో బాధపడుతున్న రోగులు టిక్కెట్ ధరపై 75 శాతానికి పైగా తగ్గింపు పొందే అవకాశం ఉంటుంది.