New Railway Super App Is Coming: రైల్వే ప్రయాణీకులకు ఎప్పటికప్పుడు సరికొత్త సేవలు అందుబాటులోకి తీసుకొచ్చే రైల్వేశాఖ.. రైలు ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ప్రభుత్వం సరికొత్త రైల్వే సూపర్ యాప్ను తీసుకువస్తోంది. రైల్వేకు సంబంధించిన అన్ని సేవలు ఒకే చోట చేర్చి ఈ యాప్ ను రూపొందిస్తున్నట్లు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. ప్రస్తుతం, రైలు టికెట్ బుకింగ్ కోసం ప్రయాణీకులు IRCTC యాప్ తో పాటు వెబ్సైట్ ను ఉపయోగిస్తున్నారు. రైలు రన్నింగ్ స్టేటస్ ను తెలుసుకునేందుకు, PNR స్టేటస్ చెకింగ్ కు ప్రత్యేక యాప్ని ఉపయోగిస్తున్నారు. పలు రకాల సేవలను పలు చోట్ల చూడాలంటే ప్రయాణీకులకు ఇబ్బంది కలుగుతున్నది. ఈ నేపథ్యంలో సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వం సరికొత్త సూపర్ యాప్ను తీసుకువస్తోంది.
రైల్వే సూపర్ యాప్ ప్రత్యేకత ఏంటంటే?
తాజాగా రైల్వే సూపర్ యాప్ గురించి రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పినా, పెద్దగా వివారాలేవీ వెల్లడించలేదు. కానీ, స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ యాప్ ద్వారా ఆన్ లైన్ ద్వారా టికెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉంది. రైలు ట్రాకింగ్, PNR స్టేటస్ తనిఖీ చేసుకోవచ్చు. రైలు కరెంట్ రన్నింగ్ స్టేటస్ ను కూడా సులభంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. టికెట్ క్యాన్సిల్ చేసుకునే అవకాశం ఉంది.
అన్ని రైల్వే సేవలకు ఒకే స్టాఫ్
ప్రధానమంత్రిగా మోదీ బాధ్యతలు చేపట్టిన తర్వాత రైల్వే వ్యవస్థలో కీలక మార్పులకు శ్రీకారం చుడుతున్నట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. టెక్నాలజీని అందిపుచ్చుకొని సరికొత్త రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు. రోజు రోజుకు వాటి విస్తృతిని పెంచుతున్నట్లు తెలిపారు. గత దశాబ్ద కాలంగా రైల్వే మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు, అత్యాధునికంగా తీర్చిదిద్దేందుకు కేంద్రం దృష్టి సారిస్తోందన్నారు. మునుపటి కంటే డిజిటల్ మెరుగులు అద్దుతున్నట్లు తెలిపారు. అందులో భాగంగానే ఈ సూపర్ యాప్ ను తీసుకొస్తున్నట్లు తెలిపారు. ప్లాట్ ఫారమ్ నుంచి జనరల్ టికెట్ వరకు ఆన్లైన్ మోడ్లో కొనుగోలు చేసుకునే అవకాశం ఉందన్నారు. ఇకపై లైన్లలో నిలబడే అవసరం లేదన్నారు. ప్రస్తుతం రైల్వేకు సంబంధించి ఆన్ లైన్ సేవలు వివిధ ప్లాట్ఫారమ్లలో అందుబాటులో ఉన్నాయని.. వాటిని ఒకే చోటుకి తీసుకొస్తున్నట్లు తెలిపారు.
Also Read: బాబోయ్.. పెట్రోల్ కారుతో పోల్చితే ఎలక్ట్రిక్ కారు ఇంత బెస్టా? ఏడాదికి అంత డబ్బు ఆదా చేసుకోవచ్చా?
రైల్వే భద్రతపై ప్రభుత్వం ఫోకస్
రైల్వే భద్రతపై కేంద్రం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. రైలు ప్రమాదాల సంఖ్య తగ్గించే దిశగా కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చింది. ప్రభుత్వం స్వదేశీ ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ (ATP) వ్యవస్థను అమలు చేస్తోంది. ‘కవచ్’ పేరుతో దీన్ని అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం, 10,000 కవచ్లు ఏర్పాటు చేశారు. ఈ టెక్నాలజీతో రైళ్లు ఢీకొనే ముప్పు తప్పింది.