Indian Railways: టికెట్ లేకుండా ట్రైన్లో ప్రయాణిస్తే ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్స్(టీటీ) వారిని దింపేయొచ్చు. ఇది మనందరికీ తెలుసు. కానీ, టికెట్ ఉన్నా కొందరిని దింపేసే రూల్స్ భారత రైల్వే మ్యానువల్లో ఉన్నాయి. టికెట్ కొనుక్కుని ట్రైన్ ఎక్కి ప్రయాణిస్తున్నా.. మధ్యలో టీటీ మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని దింపేయొచ్చు. ఇది ప్రయాణికుల క్షేమం కోసం తీసుకున్న నిర్ణయం.
భారత రైల్వే శాఖ ప్రయాణికులు సుఖవంతమైన, సురక్షితమైన ప్రయాణ సౌకర్యాన్ని అందించడానికి కొన్ని నిబంధనలు రూపొందించింది. రైల్వే శాఖ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిసిటీ డైరెక్టర్ ప్రకారం.. ప్రయాణికులు తమ గమ్యస్థానం దాకా సురక్షితంగా ప్రయాణం చేయడానికి ఓ నిబంధన ఉన్నది. ప్రయాణానికి ముందు లేదా.. ప్రయాణిస్తున్నప్పుడు ప్రయాణికుడు ఆరోగ్యం ప్రమాదకరంగా ఉన్నదా? లేదా? అనేది పరీక్షించే బాధ్యతను టీటీకి ఉంటుంది.
ఒక వేళ ప్రయాణికుడి ఆరోగ్యం విషమంగా ఉంటే.. ప్రయాణం ముగిసేలోగా ఆయన పరిస్థితి దారుణంగా దిగజారిపోయే ముప్పు ఉంటే ట్రైన్ దిగి హాస్పిటల్లో చికిత్స చూపించుకోవాల్సిందిగా టీటీ ఆదేశిస్తాడు. అయినా.. తాను దిగనని మారాం చేస్తే.. ఆరోగ్యం విషమంగా ఉన్నప్పటికీ ప్రయాణం చేస్తానని పట్టుబడితే టీటీ ఆయనను బలవంతంగా ట్రైన్ నుంచి దింపేయొచ్చు.
Also Read: మీ IRCTC అకౌంట్ ద్వారా ఫ్రెండ్స్, ఫ్యామిలీకి టికెట్స్ బుక్ చేస్తే జైలుకు వెళ్తారా? నిజం ఏమిటి?
ఈ నిబంధన వెనుక ఉన్న కారణం స్పష్టంగానే ఉన్నది. ప్రయాణికులు ఆరోగ్యం విషమంగా ఉన్నప్పుడు కూడా ట్రైన్ ప్రయాణం కొనసాగిస్తే ప్రమాదకరం. ఎందుకంటే ట్రైన్లో వైద్య సహాయం అందించే సేవలు పరిమితంగా ఉంటాయి. కాబట్టి.. ఈ నిబంధన రైల్వే ప్రయాణికుల భద్రత కోసం పొందుపరచబడింది.
ఇలా హెల్త్ గురించి టీటీ అడిగినప్పుడు ప్రయాణాన్ని కొనసాగించడానికి తనకు శక్తి సామర్థ్యాలు ఉన్నాయని, ఫిట్నెస్ ఉన్నదని వెల్లడించే మెడికల్ సర్టిఫికేట్ను చూపించాల్సి ఉంటుంది. ఇది చూపిస్తేనే ఆ ప్రయాణికుడు తన రైలు ప్రయాణాన్ని కొనసాగించవచ్చు.
ఈ నిబంధన ప్రయాణిల భద్రత కోసమే. కాబట్టి.. ఈ నిబంధన పట్ల రైల్వే సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.