Cyber crime: ఆన్లైన్ డెలివరీలు యాప్లు వినియోగిస్తున్న వారిని లక్ష్యంగా చేసుకొని కేటుగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు. అలా ఓ మహిళ స్విగ్గీ అకౌంట్ నుంచి ఏకంగా రూ.97 వేలు దోచుకున్నారు. పెద్ద ఎత్తున ఆపర్లు ఇస్తాం.. లక్కీ డ్రా వచ్చింది బహుమతులు తీసుకెళ్లండి అంటూ అమాయక ప్రజలను నమ్మించి మోసం చేస్తున్నారు నేరస్తులు.
అయితే ఇప్పుడు కొత్త అవతారం ఎత్తారు నేరగాళ్లు. ఆన్ లైన్ డెలివరీ యాప్ లు వినియోగిస్తున్న వారే లక్ష్యంగా చేసుకొని మోసాలకు తెరలేపారు నేరస్తులు. మీ ఖాతా హ్యాక్ అయ్యిందంటూ నమ్మించి మోసం చేస్తున్నారు నేరగాళ్లు. అలాంటి దారులకు పాల్పడుతున్న ఇద్దరు నేరస్థులను పట్టుకొని అరెస్టు చేశారు పోలీసులు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఐవీఆర్ (Interactive Voice Response)అనే సాంకేతిక సాయంతో సైబర్ నేరగాళ్లు ఓ మహిళకు కాల్ చేశారు. స్విగ్గీ అధికారులమనీ, మీ ఖాతా హ్యాక్ అయ్యిందని మాయమాటలు చెప్తున్నట్లు వెల్లడించారు. అకౌంట్ను యాక్సెస్ చేయడానికి అపరిచితులు ప్రయత్నిస్తున్నారని నేరస్తులు ఆ మహిళను నమ్మించినట్లు తెలిపారు.
ఖాతాను రక్షించడానికి మరికొంత సమాచారం తెలపాల్సి ఉంటుందన్నారన్నారు. నిజంగానే తన అకౌంట్ ప్రమాదంలో పడిందేమోనని నమ్మిన మహిళ వెంటనే తన యూజర్ నేమ్, పాస్వర్డ్ వంటి వ్యక్తిగత వివరాలు వారికి తెలిపిందని వెల్లడించారు. అంతే తన ఖాతా నుంచి రూ.97వేలు మాయమయ్యాయని పోలీసులు తెలిపారు.
డబ్బులు తన అకౌంట్ నుంచి పోయిన విషయం తెలుసుకున్నబాధిత మహిళ వెంటనే పోలీసులకు ఫిర్యాది చేసింది. స్విగ్గీ అకౌంట్కు లింక్ చేసిన అకౌంట్ నుంచి డబ్బులు పోయాయని తెలిపింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు గురుగ్రామ్కు చెందిన అనికేత్ కల్రా (25), హిమాన్షు కుమార్ (23) దోషులుగా గుర్తించి తక్షణమే అరెస్టు చేశారు. వీరిలో కల్రా అనే వ్యక్తి ఇంతకుముందు స్విగ్గీ, జొమాటోలో డెలివరీ బాయ్గా పని చేశాడని పోలీసులు తెలిపారు. ఆ సమయంలో కిరాణా వస్తువుల్ని తక్కువ ధరలకు కొని లాభం కోసం తిరిగి విక్రయించేవాడని తెలిసింది. ఇలా ఆన్లైన్ ఆర్డర్లు చేసేవారి సమాచారం సేకరించి హిమాన్షుతో కలిసి డబ్బుల్ని దోచుకుంటున్నారనే విషయం పోలీసుల విచారణ లో బయటపడింది.