Salary Hike: సార్వత్రిక ఎన్నికల ముందు కేంద్ర ప్రభుత్వం దేశీయ జీవిత బీమా దిగ్గజం ఎల్ఐసీ ఉద్యోగులకు భారీ శుభవార్త చెప్పింది. LIC ఉద్యోగుల 17 శాతం వేతన సవరణ పెంపునకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో 1.10 లక్షల మంది ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు.
ప్రభుత్వ బీమా రంగ సంస్థ అయిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉద్యోలకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. LIC ఉద్యోగుల 17 శాతం వేతన పెంపు ప్రతిపాదనను అమలు చేయడానికి అనుమతులు మంజూరు చేయనున్నట్లు వెల్లడించింది. ప్రభుత్వరంగ బ్యాంకుల ఉద్యోగుల జీతాలు పెంచిన కొద్ది రోజలుకే కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. 2022 ఆగష్టు 1వ తేదీ నుంచి ఈ వేతన పెంపు అమలులోకి వస్తుందని కేంద్రం తెలిపింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా LICలో పనిచేస్తున్న 1.10 లక్షల మంది ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు.
దీంతో పాటుగా మరికొన్నింటికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోద ముద్ర లభించింది. 2010 ఏప్రిల్ 1 తర్వాత ఉద్యోగంలో చేరిన దాదాపు 24,000 మంది ఎల్ఐసీ ఉద్యోగుల నేషనల్ పెన్షన్ సిస్టమ్ కంట్రిబ్యూషన్ను చందాను 10 నుంచి 14 శాతానికి పెంచేందుకు కూడా ప్రభుత్వం ఆమోద ముద్ర వేసినట్లు ప్రకటించింది. దీంతో పాటుగా పెన్షనర్లకు వన్ టైమ్ ఎక్స్గ్రేషియా చెల్లింపునకూ కేంద్రం పచ్చజెండా ఊపింది. ఈ నిర్ణయంతో దాదాపు 30,000 మంది పెన్షనర్లు, కుటుంబ పెన్షనర్లు లబ్ధి పొందనున్నారు. ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు కుటుంబ పెన్షన్లను పెంచింది. ఇప్పటికే కేంద్రం 21,000 కంటే ఎక్కువ కుటుంబాలకు సహాయం చేసింది.
Also Read: E Vehicle Policy : ఈవీ పాలసీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఇక టెస్లా ఎంట్రీ..!
బ్యాంక్ ఉద్యోగులకు జీతాలు పెంచనున్న కేంద్రం
గత కొన్నేళ్లుగా బ్యాంక్ ఉద్యోగులు కోరుతున్న జీతాలు పెంపు, వారానికి 5 రోజుల పని దినాల డిమాండ్ లను కూడా కేంద్ర ప్రభుత్వం ఇటీవలే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ డిమాండ్లకు సంబంధించి భారతీయ బ్యాంకుల సమాఖ్య, బ్యాంకు ఉద్యోగుల సంఘాల మధ్య ఒప్పందం కుదిరింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో బ్యాంకు ఉద్యోగుల వార్షిక వేతనం 17 శాతం పెరగనుంది. దీంతో పాటుగా ఇక మీదట వారానికి ఐదు రోజులు మాత్రమే పని చేయనున్నారు. 2022 నవంబర్ నుంచి జీతాల పెంపు అమల్లోకి రానుంది. వేతనాల పెంపుతో ప్రతి ఏడాది అదనంగా రూ. 8284 కోట్ల భారం పడనుంది. ఈ జీతాల పెంపు కారణంగా 8 లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు.